ముంబై : మణిపూర్ హింసాకాండలో (Manipur Violence) చైనా జోక్యం ఉందని అక్కడ అలజడి రేపడంలో డ్రాగన్ కుట్రపూరితంగా వ్యవహరించిందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. చైనాపై ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రౌత్ డిమాండ్ చేశారు. కేంద్రంలో, మణిపూర్లో బీజేపీ అధికారంలో ఉండగా ఈశాన్య రాష్ట్రం మే 3 నుంచి అశాంతితో భగ్గుమంటున్నదని శివసేన ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.
40 రోజులుగా మణిపూర్లో అల్లర్లు చెలరేగుతూ రాష్ట్రం అట్టుడుకుతున్నదని, ప్రజలు ఇండ్లు విడిచి పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, పరిస్ధితిని చక్కదిద్దేందుకు మీరేం చర్యలు తీసుకున్నారని పాలక కాషాయ నేతలను ఆయన నిలదీశారు. మణిపూర్లో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైన సీఎం ఎన్ బీరేన్ సింగ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో విదేశీ హస్తం ఉందని బీరేన్ సింగ్ సంకేతాలు పంపిన నేపధ్యంలో శివసేన నేత ఈ వ్యాఖ్యలు చేనశారు.
మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ వైదొలగాలని, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సంజయ్ రౌత్ కోరారు. కాగా సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన బీరేన్ సింగ్ రాజ్భవన్కు వెళుతుండగా వేలాది మంది బీరేన్ కాన్వాయ్ను అడ్డగించి సీఎంగా కొనసాగాలని పట్టుబట్టడంతో ఇంఫాల్లో హైడ్రామా నెలకొంది. ఆపై ఈ కీలక దశలో తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదని బీరేన్ సింగ్ ట్వీట్ చేయడం పెను దుమారం రేపింది. ఇక మే 3 నుంచి రాష్ట్రంలో మెటై, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణలు, చెలరేగిన హింసాకాండతో ఇప్పటివరకూ 100 మందికి పైగా మరణించారు.
Read More :