ముంబై : కాషాయ పార్టీ అధికారమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారుతుందని శివసేన నేత (యూబీటీ), ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) పేర్కొన్నారు. ఇతర పార్టీలను చీల్చి ఆపై వారిని తమ పార్టీలో కలిపేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ విపక్ష ప్రభుత్వాలను కుట్రపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందని, అత్యంత అవినీతిపరులు కాషాయ కండువా కప్పుకోగానే నీతిమంతులుగా ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దేశ పరిస్ధితిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ దుస్ధితికి అద్దం పడతాయని అన్నారు. బీజేపీ స్వార్ధపూరిత వైఖరే మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. కాగా, శరద్ పవార్పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన అజిత్ పవార్ 9 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించి షిండే సర్కార్లో చేరడంతో ఎన్సీపీ నిట్టనిలువునా చీలిన సంగతి తెలిసిందే.
షిండే సర్కార్లో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, 9 మంది రెబెల్ ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు తమదే అసలైన ఎన్సీపీ అని పార్టీ చిహ్నం, పేరును తమకే కేటాయించాలని కోరుతూ అజిత్ పవార్ వర్గం ఈసీని ఆశ్రయించింది. శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ఎన్సీపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అజిత్ పవార్ సహా రెబెల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు.
Read More :
Amarnath Yatra | మెరుగుపడ్డ వాతావరణ పరిస్థితులు.. అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం