Sanjay Raut | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అదంతా భ్రమలతో కూడిన బడ్జెట్ అని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ఓ జుమ్లా బడ్జెట్ అని, గోల్మాల్ బడ్జెట్ అని ఆరోపించారు. అంతేకాకుండా కేవలం టైంపాస్ కోసం ఈ బడ్జెట్ను రూపొందించారని విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ ద్వారా పేదలకు, మధ్యతరగతికి ఒరింగిందేమో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ను ఆయన అట్టర్ ప్లాఫ్ సినిమాతో అభివర్ణించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ గురించి కూలంకషంగా సభలో మాట్లాడతానని, తమకున్న అభ్యంతరాలను కచ్చితంగా సభ ముందు ఉంచుతానని ఆయన ప్రకటించారు. ప్రతి బడ్జెట్లో ఎలాంటి మాటలైతే మాట్లాడతారో… అవే ఇప్పుడూ కనిపించాయి. ఈ బడ్జెట్ ద్వారా పేదలకు, మధ్యతరగతి వారికి ఒరింగిందేమి? కేంద్రం పేర్కొన్న హామీలన్నీ ఒట్టి మాటలే అంటూ సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు.
బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ ఏకం కావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ఇలా ఏకం కావాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి వక్కానించారు. ఇక… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం ఉద్ధవ్తో భేటీ అవుతారని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించగా… గత నెల నుంచి తాము కలిసే పనిచేస్తున్నామని, 2024 నాటికి ఓ ప్రత్యామ్నాయం కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని రౌత్ వెల్లడించారు.