అహ్మదాబాద్: ఇళ్ల నుంచి చెత్త సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) నగల పెట్టె దొరికింది. అయితే అందులోని బంగారు ఆభరణాలపై వారు ఆశ పడలేదు. తమ నిజాయితీని చాటారు. నగల పెట్టెను పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలిసిన మేయర్, ఆ పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు గణేష్ కుమార్, మురళీధర్, షీలా వాంఖడే, చెత్త వ్యాన్ డ్రైవర్ సల్మాన్ షేక్ కలిసి నిషాల్ ఫాలియా ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించారు. అనంతరం ఒక పార్కులో ఆ చెత్తను వేరుచేస్తుండగా నగల పెట్టె కనిపించింది. దానిని తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నాయి.
కాగా, ఆ పారిశుద్ధ్య కార్మికులు ఆ నగలపై ఆశపడలేదు. వాటిని తీసుకోకూడదని భావించారు. నగల పెట్టెను పోగొట్టుకున్న వారు ఎంతో బాధతో వెతుకుతుంటారని గ్రహించారు. సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆ నగల పెట్టెను పోలీసులకు అప్పగించారు. దాని యజమానిని గుర్తించి అందజేయాలని కోరారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల చిత్తశుద్ధి, నిజాయితీని పోలీస్ అధికారి మెచ్చుకున్నారు.
మరోవైపు సూరత్ మేయర్ దక్షేష్కు ఈ విషయం తెలిసింది. దీంతో స్టాండింగ్ కమిటీ ఛైర్మన్తో కలిసి ఆ పారిశుద్ధ్య కార్మికులను వ్యక్తిగతంగా ఆయన సత్కరించారు. వారి అంకితభావం, నిజాయితీ ఇతరులకు స్ఫూర్తిదాయకం అని మేయర్ ప్రశంసించారు.