(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ సర్కార్ను గద్దె దించే లక్ష్యంతో జతకట్టిన విపక్ష కూటమి ‘ఇండియా’ పరిస్థితి కప్పల తక్కెడలా తయారైంది. ఏ అంశంపైనా కూటమి పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కూటమిలో ఉన్న పార్టీలు ‘ఎవరికి వారే యమున తీరే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీని ఈ కూటమి ఎలా ఎదుర్కొంటుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించే బీఆర్ఎస్తో పాటు కొన్ని పార్టీలు దూరంగా ఉండటమో, లేక తటస్థ వైఖరి అనుసరించడమో చేస్తున్నాయా? అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం కీలకమైన అంశాలపైన అయినా కూటమికి నిర్దిష్టమైన అభిప్రాయం లేకపోతే కూటమి కట్టడం వల్ల ప్రయోజనం ఏంటని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే పెదవి విరుస్తున్నది. కూటమి పగ్గాలు తన చేతిలోనే ఉండాలని కాంగ్రెస్ కోరుకోవడం తప్ప దీనిని ఏకతాటిపై నడిపించడంలో వైఫల్యం చెందుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి.
ఎడ్డమంటే.. తెడ్డం
సనాతన ధర్మం, జీ20 విందు, జమిలి ఎన్నికలు, మహిళా బిల్లు, దేశం పేరు భారత్గా మార్చే అంశంపై కూడా కూటమి నేతలు ఏకతాటిపైకి రావడం లేదు. ఓ పార్టీ ఎడ్డమంటే, మరో పార్టీ తెడ్డం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. కూటమి పేరు మొదలుకొని.. కూటమి సారథ్యం.. కన్వీనర్.. చైర్మన్గా ఎవరుండాలి అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. బీహార్ సీఎం నితీశ్కుమార్ రెండో సమావేశానికే అలకపాన్పు ఎక్కారు.
సీట్లపైనా లొల్లి…
కూటమికి పూర్తిస్థాయి రూపు సంతరించుకోకముందే సీట్ల లొల్లి మొదలైంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఇప్పటికే కాంగ్రెస్, ఆప్ స్థానిక నేతలు పోటాపోటీగా ఒంటరి పోరు గురించి ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీలోని అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాము కూడా ఒంటరిగానే బరిలో దిగుతామని కాంగ్రెస్ ప్రకటించింది. పంజాబ్, హర్యానాలోనూ కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఆప్ నేతలు ఇటీవల చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై కాంగ్రెస్ కూడా తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్టు పేర్కొంది.
జీ20 విందు… కూటమిలో చిచ్చు
జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంపై కూటమి నేతలేవరూ స్పందించలేదు. మరోవైపు కీలక పార్టీల అధినేతలు మమతా బెనర్జీ, నితీశ్కుమార్ విందుకు హాజరవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి బాహాటంగానే స్పందించారు. జేడీయూ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా దీన్ని తప్పుబట్టారు. కాగా, నితీశ్కుమార్ బీజేపీతో మళ్లీ జత కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విందుకు ఆయన హాజరైన తర్వాత బీహార్కు రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల అయ్యాయి. దీంతో ఆయన వైఖరిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జమిలిపై ఏకాభిప్రాయం కరవు…
జమిలి ఎన్నికలపై ఇండియా కూటమికి స్పష్టమైన వైఖరి లేదు. ఇది తమ వైఖరి అని కూటమి స్పష్టంగా చెప్పలేకపోయింది. జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని కాంగ్రెస్ చెప్పి న తర్వాత కూడా సమాజ్వాదీ పార్టీ జమిలి ఎన్నికలను సమర్థించడం చర్చనీయాంశమైంది. ఇండియా పేరును భారత్గా మార్చవద్దని కూటమి పక్షాలు పేర్కొనగా.. ఇండియా పక్కన భారత్ చేర్చితే సరిపోతుందని మమత సానుకూలంగా స్పందించారు. కూటమిలో ఏకాభిప్రాయం లేకుండా.. కూటమిని ప్రజలు ఏలా ఆదరిస్తారని పలువురు విమర్శిస్తున్నారు.
సనాతన ధర్మంపై తలోమాట…
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూటమిని తీవ్ర ఇరకాటంలో పడేసింది. స్టాలిన్ వ్యాఖ్యలు కూటమి అభిప్రాయమని పేర్కొంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. డీఎంకే పార్టీ విపక్ష కూటమిలో కీలకం కావడంతో మిగతా పార్టీలు దీనిపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను తప్పుపట్టలేని.. మరోవైపు సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయనిధి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కార్తి చిదంబరం, ప్రియాంక ఖర్గే సమర్థించగా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాత్రం ఆచితూచి స్పందించారు. అయితే మధ్యప్రదేశ్లో త్వరలో ఎన్నికలు ఉండటంతో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమలానాథ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.