న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై (Sanatan Dharma Row) డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, రాజా చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ అంగీకరించదని కాంగ్రెస్ గురువారం స్పష్టం చేసింది. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ సర్వధర్మ సమభావాన్ని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుందని పేర్కొంది. అన్ని మతాలు, విశ్వాసాలు, వర్గాల విశ్వాసాలను ఇండియా కూటమిలోని ప్రతి ఒక్క సభ్యుడూ గౌరవిస్తాడని తెలిపింది.
ఏ మత విశ్వాసం కంటే మరో మత విశ్వాసం గొప్పదనే రీతిలో ఏ ఒక్కరూ వ్యవహరించరాదని, అన్ని మతాలూ సమానమేనని కాంగ్రెస్ నమ్ముతుందని ఆ పార్టీ మీడియా, ప్రచార విభాగం చీఫ్ పవన్ ఖేరా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే పార్టీ వైఖరి మీకు అర్ధమవుతుందని, రాజ్యాంగంలోనూ అన్ని మతాలూ సమానమేనని స్పష్టం చేశారని కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎన్నడూ పునరాలోచన చేయదని తేల్చిచెప్పారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనాలతో పోల్చుతూ దీన్ని నిర్మూలించాలని ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించగా తాము ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరించబోమని అన్నారు.
ఈ అంశాన్ని భాగస్వామ్య పక్షం డీఎంకేతో ప్రస్తావిస్తారా అని అడగ్గా అన్ని మతాలను తమ కూటమి భాగస్వామ్య పార్టీలు గౌరవిస్తాయని తమకు తెలుసని, ఈ విషయాన్ని లేవనెత్తాల్సిన అవసరం లేదని పవన్ ఖేరా బదులిచ్చారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించాలనుకునేవారు అలా చేయవచ్చని, అయితే ఇండియా కూటమిలో ప్రతి ఒక్క సభ్యుడు అన్ని మతాల , వర్గాల విశ్వాసాలను గౌరవిస్తారని పేర్కొన్నారు. మరోవైపు సనాతన ధర్మం హెచ్ఐవీ, లెప్రసీ వంటిదని డీఎంకే సీనియర్ నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Read More :