లక్నో: దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తుండటంతో ఈ అంశంపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. (India vs Bharat row ) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరుపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ వివాదంపై తాజాగా స్పందించారు. బీజేపీ కూడా పార్టీ పేరును బీజేడీగా మార్చుకోవాలని ఆయన సూచించారు.
కాగా, భాషల పరస్పర వినియోగం మానవత్వం, వ్యక్తుల మధ్య సామరస్యం, అభివృద్ధికి చిహ్నమని అఖిలేష్ యాదవ్ తెలిపారు. అయితే సంకుచిత మనస్తత్వం కలిగిన బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆంగ్ల భాషను, ఆ పదాలను బానిసత్వానికి చిహ్నంగా భావిస్తున్నారని విమర్శించారు. దీని కోసమే దేశం పేరు మార్చాలనుకుంటే ముందుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ‘పార్టీ’ అన్న ఇంగ్లీష్ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
దీని కోసం బీజేపీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దేశీయ సంప్రదాయానికి చెందిన ‘దళ్’ పదాన్ని చేర్చాలని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని భారతీయ జనతా దళ్ (బీజేడీ)గా మార్చుకోవాలని ఆయన సూచించారు. సోషల్ మీడియా అయిన ఎక్స్లో ఈ మేరకు హిందీలో పోస్ట్ చేశారు.
वैसे तो भाषाओं का मिलन और परस्पर प्रयोग बड़ी सोच के लोगों के बीच मानवता और सौहार्द के विकास का प्रतीक माना जाता है फिर भी अगर संकीर्ण सोचवाली भाजपा और उसके संगी-साथी किसी भाषा के शब्द को गुलामी का प्रतीक मानकर बदलना ही चाहते हैं तब तो सबसे पहले भाजपा को भी अपना एक विशेष सत्र…
— Akhilesh Yadav (@yadavakhilesh) September 7, 2023