Same-Sex Marriage | స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలంటూ దాఖలైన పిటిషన్లపై వరుసగా మూడోరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ రాజ్యాంగ ధర్మాసనం గురువారం వాదనలు విన్నది. అయితే, సుప్రీంకోర్టు పిటిషన్లపై విచారణను వెబ్సైట్తో పాటు యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ వివాహానికి ఆడ, మగే అవసరమా? అని ప్రశ్నించారు. స్వలింగ వ్యక్తుల మధ్య బంధం కేవలం శారీరకమైందని కాదని, నిలకడైన, భావోద్వేగమైన సంబంధంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలంటే.. వివాహం పరిణామ భావాన్ని పునర్నిర్వహించాల్సి ఉంటుందన్నారు. పెళ్లి చేసుకోవడానికి భాగస్వాములు లింగ పరంగా వేర్వేరు జాతులకు చెందినవారు (స్త్రీ, పురుషులు) ఉండవలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. 1954లో ప్రత్యేక వివాహ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ చట్టం గత 69 ఏళ్లుగా గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. వ్యక్తిగత చట్టాలను పాటించకూడదనుకునే వారికి.. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం.. పెళ్లి చేసుకోవడానికి అవకాశం కల్పించిన విషయాన్ని సీజేఐ గుర్తు చేశారు. ఈ సందర్భంగా 2018లో మోసెక్సువాలిటీ నేరం కాదంటూ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఆ సమయంలో న్యాయస్థానం స్వలింగ వయోజన వ్యక్తుల మధ్య సంబంధం కలిగి ఉండవచ్చని తీర్పు ద్వారా గుర్తించినట్లు తెలిపారు.
స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకున్నపుడు, వారి పిల్లలు గృహహింసను చూస్తున్నపుడు జరిగేదేంటని ప్రశ్నించారు. మద్యానికి బానిసైన తండ్రి రోజూ తన తల్లిని కొడుతూ ఉంటే.. మద్యం కోసం డబ్బులు అడుగుతూ ఉంటే, ఆ పరిస్థితిని చూసే పిల్లలు సాధారణ వాతావరణంలో పెరుగుతారా? అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. అయితే, స్వలింగ వివాహాలు చేసుకుంటే పిల్లలు పుట్టడం సాధ్యం కాదంటూ న్యాయవాదులు వాదనలు వినిపించగా.. సీజేఐ జోక్యం చేసుకుంటూ.. స్త్రీ, పురుషులు వివాహం చేసుకున్న సమయంలో కూడా.. నేటికాలంలో విద్యావ్యాప్తి జరగడంతోపాటు, ఆధునిక కాలపు ఒత్తిళ్లు కూడా పెరిగాయని, ఫలితంగా దంపతులు పిల్లలు లేకుండా ఉండిపోతున్నారని, కేవలం ఒకే బిడ్డను కనడమైనా చేస్తున్నారని అన్నారు.
కొడుకు తప్పనిసరిగా ఉండాలనే భావం నుంచి దూరమవుతున్నారన్నారు. అయితే, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో స్వలింగ జంటలు సైతం ఉన్నాయి. అయితే, స్వలింగ వివాహాలను భర్త, భార్య, పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ భావనతో పోల్చదగినవి కావని కేంద్రం స్పష్టం చేసింది. పిటిషన్లు పట్టణ ఉన్నత వర్గాల అభిప్రాయాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయని, వీటిని సయుచిత శాసనసభతో పోల్చలేమని, ఇది విస్తృత స్థాయికి సంబంధించిన అభిప్రాయాలను తెలుసుకోవాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలను తీసుకోవాలని కోరింది.