లక్నో : తాలిబన్లకు మద్దతుగా వారిని భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చిన ఎస్పీ ఎంపీ షఫీకర్ బర్క్పై దేశద్రోహం కేసు నమోదైంది. ఆప్ఘనిస్ధాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని సమర్ధించడంతో పాటు వారి దండయాత్రను భారత స్వాతంత్ర్య పోరాటంతో పోల్చుతూ సంభాల్ ఎంపీ ఆగస్ట్ 16న చేసిన ప్రకటనపై యూపీ పోలీసులు ఆయనపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భారత్ బ్రిటిష్ పాలనలో మగ్గినప్పుడు మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిందని, ఇప్పుడు తాలిబన్లు కూడా తమ దేశాన్ని స్వేచ్ఛగా తాము పరిపాలించుకోవాలని కోరుకుంటున్నారని ఎస్పీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆప్ఘన్ స్వాతంత్ర్యం ఆ దేశ పౌరుల వ్యవహారమని, ఆప్ఘనిస్ధాన్ను అమెరికా ఎందుకు పరిపాలించాలని ఆయన ప్రశ్నించారు. షఫీకర్ వ్యాఖ్యలపై యూపీ డిప్యూటీ సీఎం కేపీ మౌర్య స్పందిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఎస్పీ నేతలకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని వారి వ్యాఖ్యలు చెబుతున్నాయని అన్నారు. బీజేపీ నేతలు రాజేష్ సింఘాల్, ఓంవీర్ ఖద్వంశీల ఫిర్యాదుపై ఎస్పీ నేతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు తాను తాలిబన్లను తాను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చలేదని, తన ప్రకటనను వక్రీకరించారని ఎస్పీ ఎంపీ వివరణ ఇచ్చారు. ఆప్ఘన్లో ఏం జరుగుతుందో తనకు అనవసరమని, తాను భారత ప్రభుత్వ విధానాలను సమర్ధిస్తానని చెప్పుకొచ్చారు.