లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) గురువారం 56 మంది అభ్యర్ధులతో జాబితాను ప్రకటించింది. యూపీ ఎన్నికల్లో ఎస్పీ జయంత్ చౌధరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ)తో పాటు ఓం ప్రకాష్ రాజ్భర్ సారధ్యంలోని సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ సహా పలు ఇతర చిన్న రాజకీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది.
మరోవైపు జయంత్ చౌధరిని కాషాయ పార్టీలోకి రావాలని బీజేపీ అగ్రనేతలు కోరుతుంటే జాట్ల ఓట్లను కావాలనుకుంటే జయంత్ చౌధరిని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని ఆర్ఎల్డీ నేత అనిల్ చౌధరి పేర్కొన్నారు. ఇక యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలో మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది.
ప్రియాంక గాంధీ ఇమేజ్తో ఉనికి చాటేందుకు కాంగ్రెస్ సమాయాత్తమవుతుండగా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఎన్నికల బరిలో సత్తా చాటేందుకు చెమటోడుస్తోంది. ఇక ఫిబ్రవరి పది నుంచి ఏడు దశల్లో మార్చి 7 వరకూ యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.