న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ గాంధీ కుటుంబీకులే నేతృత్వం వహిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. తమ పార్టీలో చాలా మంది నేతలున్నా కీలక నేతలు మాత్రం గాంధీ కుటుంబీకులేనని చెప్పారు. ఖర్గేజీ తమ జాతీయ అధ్యక్షుడని, పార్టీని సంస్ధాగతంగా పటిష్టం చేయడంలో మల్లికార్జున్ ఖర్గే కీలక పాత్ర పోషిస్తారని వ్యాఖ్యానించారు.
ఇక సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే కాంగ్రెస్ నడుస్తోందనే వాస్తవాన్ని ఖుర్షీద్ వ్యాఖ్యలు మరోసారి బహిర్గతం చేశాయని కాషాయ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను ప్రస్తావిస్తూ ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడిగా బీజేపీ అభివర్ణించింది.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా నిర్ణయాధికారం మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలదేనని తేటతెల్లమైందని బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అసలు ఖర్గేను తాము రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా లేక రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అనాలా అని ఆయన ప్రశ్నించారు.