న్యూఢిల్లీ : విపక్ష నేతను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంపై పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతల ప్రజాస్వామిక ఎంపికను ప్రశ్నించేందుకు ఆయన దైవత్వాన్ని ఎంపిక చేసుకున్నారు. రాజకీయాలంటే కేవలం ఎన్నికలు గెలవడం కోసమే కాదని వ్యాపారికి ఎలా అర్ధం అవుతుందని సల్మాన్ ఖుర్షీద్ పీకే వ్యాఖ్యలపై చురకలు వేశారు.
దైవత్వం విశ్వాసానికి సంబంధించింది..ప్రజాస్వామ్యం విశ్వాసంతో ముడిపడినదే..ప్రజాస్వామ్య ఎంపిక కోసం ఇతరులు స్క్రిప్ట్ రాయలేరు..ప్రజాస్వామిక ఎంపిక అర్ధం కాకుంటే తిరిగి స్కూల్కు వెళ్లి మళ్లీ నేర్చుకోవడం మొదలు పెట్టండని పీకేకు క్లాస్ పీకారు. విశ్వాసమే బీజేపీకి దీటైన సమాధానం ఇస్తుందని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. కాగా రాహుల్ గాంధీ నాయకత్వంపై పీకే గురువారం విమర్శల దాడి చేశారు.
పార్టీ నాయకత్వమనేది ఏ వ్యక్తికీ దైవత్వంగా సంక్రమించే హక్కు కాదని, బలమైన విపక్షంగా కీలక పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ ఎలాంటి స్ధితిలో ఉందో గమనించాలని అన్నారు. గత పదేండ్లలో 90 శాతం ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన వేళ కాంగ్రెస్ నాయకత్వం ఎవరికీ దైవత్వంగా ఒనగూరే హక్కు కాదని పీకే చేసిన ట్వీట్ కాంగ్రెస్లో కలకలం రేపింది.