పహల్గాం ఘటనపై ఆపరేషన్ సిందూర్తో ప్రతీకారం తీర్చుకున్నామని, ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి పాకిస్థాన్ పీచమణిచామని మోదీ సర్కారు ఊదరగొడుతున్నది. కానీ, అదే పహల్గాం దారుణానికి సూత్రధారి మాత్రం ఆ దేశ రాజకీయ నాయకులు, అధికారులతో కలిసి అణ్వస్త్ర పరీక్షల వార్షికోత్సవంలో పాల్గొన్నాడు. అంతేకాదు అదే సభలో ఏకంగా వేదికపై నుంచి‘పహల్గాం ఉగ్రదాడితో ప్రపంచవ్యాప్తంగా నా పేరు మార్మోగుతున్నది’ అని కసూరీ జబ్బలు చరుచుకున్నాడు.
Saifullah Kasuri | న్యూఢిల్లీ, మే 29: ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్లోని ఉగ్రవాదుల పీచమణిచామని, పాకిస్థాన్ను కాళ్లబేరానికి వచ్చేలా చేశామని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊదరగొడుతుండగా, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు మాత్రం పాకిస్థాన్లో రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను వెంటపెట్టుకుని మరీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా కమాండర్ సైఫుల్లా కసూరీ దర్జాగా బహిరంగంగా తిరుగుతూ రాజకీయ వేదికలపై భారత వ్యతిరేక ఉపన్యాసాలు చేస్తున్నాడు.
బుధవారం పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ వద్ద పాకిస్థాన్ అణ్వస్త్ర పరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని యూమ్ ఇ తక్బీర్ పేరిట పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్(పీఎంఎంఎల్) నిర్వహించిన ఓ బహిరంగ సభలో కసూరీ పాల్గొని భారత్పై విద్వేషాన్ని వెళ్లగక్కాడు. లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు, హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాదిగా భారత్ ప్రకటించిన తల్హా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాడు.
పహల్గాం ఉగ్రదాడికి తాను సూత్రధారినని తనను భారత్ నిందిస్తున్నదని, యావత్ ప్రపంచంలో తన పేరు ఇప్పుడు మార్మోగుతున్నదని ర్యాలీలో మాట్లాడుతూ కసూరీ చెప్పాడు. భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్ ఇదే ర్యాలీలో ప్రసంగిస్తూ జిహాదీ నినాదాలు చేశాడు. 2024 పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్కు పోటీ చేసి సయీద్ ఓటమిపాలయ్యాడు. నిషిద్ధ లష్కరే తాయిబాకు రాజకీయ వేదికగా పీఎంఎంఎల్ ఉపయోగపడుతున్నది.