న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాష్ర్టాల హక్కులను కాలరాయడంపై కేంద్రం వైఖరిని బుధవారం రాజ్యసభలో విపక్షాలు తూర్పారబట్టాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో మోదీ సర్కారుపై నిప్పులు చెరిగాయి. చమురు, నిత్యవసర ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల వాగ్దానాన్ని ఎప్పుడో విడిచిపెట్టారని ధ్వజమెత్తారు. రైల్వే ఉద్యోగాల్లో అవకతవకలు జరిగి యూపీ, బీహార్లో అభ్యర్థులు రోడ్లపైకి వచ్చారని గుర్తుచేశారు. ‘మీరు (కేంద్రప్రభుత్వం) పనిచేసేది తక్కువ. పబ్లిసిటీ చేసేది ఎక్కువ. ఒకటి తర్వాత ఒకటి అబద్దాలు చెప్పడం మీకు అలవాటుగా మారింది. మీ తప్పులను ఎవరైనా ఎత్తిచూపితే.. ఉన్నపళంగా మీకు మతం గుర్తొస్తుంది. హిందూత్వం ప్రమాదంలో పడిపోయిందంటూ గగ్గోలు పెడతారు. పెట్టుబడులు రాకపోవడంతో ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. మంచి రోజులు (అచ్ఛే దిన్) ఇంకా ఎప్పుడొస్తాయి?’ అని ప్రశ్నించారు. లాభాలు అర్జిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద సాగు చట్టాలను ముందే వెనక్కి తీసుకొంటే 700 మంది రైతుల ప్రాణాలు పోకుండా ఉండేవన్నారు.
రాష్ర్టాల అభిప్రాయాలను సేకరించకుండా కేంద్రం అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) క్యాడర్ నిబంధనల్లో సవరణలకు ప్రతిపాదించడాన్ని డీఎంకే ఎంపీ తిరుచి శివ తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ రాష్ర్టాల హక్కులను కాలరాయడమేనన్నారు. కేంద్రం నిర్ణయాన్ని తొమ్మిది రాష్ర్టాల సీఎంలు, 100 మందికి పైగా రిటైర్డ్ సివిల్ అధికారులు ఖండించారన్న విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ సభలో గుర్తుచేశారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల పాలనా వ్యవహారాల్లో రాజ్యాంగబద్ధ పదవుల్లోని వారు జోక్యం చేసుకొంటున్నారని బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను పరోక్షంగా ఉదహరిస్తూ పేర్కొన్నారు. సమాఖ్యవాదంపై ఇది సర్జికల్ స్ట్రైక్స్ చేయడమేనన్నారు.
ప్రస్తుతం దేశంలో రెండు భారత్లు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందులో ఒకటి ధనవంతులది కాగా, మరొకటి పేదలదని అభివర్ణించారు. ఈ రెండు వర్గాల మధ్య రానురానూ అంతరం పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్సభలో మాట్లాడారు. రాష్ర్టాల గొంతుకలను నొక్కివేయడానికి న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ స్పైవేర్లను కేంద్రం ఒక ఆయుధంగా వాడుకుంటున్నదని రాహుల్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని, అయితే మోదీ హయాంలో 23 కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లారని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం 50 ఏండ్ల గరిష్టానికి చేరిందన్నారు.
కేంద్ర బడ్జెట్ రైతులపై ప్రతీకారంతో రూపొందించారని స్పష్టమైపోయిందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. పీఎం-కిసాన్ పథకం చెల్లింపులను పెంచకపోవడం, పీఎం-ఆశా పథకానికి భారీగా కోతలు పెట్టడం, ‘రైతు ఆదాయం రెట్టింపు’ ప్రస్తావనే లేకపోవడం ఇందుకు నిదర్శమన్నారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించేలా కొన్ని ఆగ్రో-రసాయనాలపై సుంకాలు, జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ నూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపుల్లో గతేడాదితో పోలిస్తే 2 శాతం పెంచడం, మొత్తంగా బడ్జెట్లో వ్యవసాయం వాటా 3.86 శాతానికి తగ్గించడాన్ని ఎత్తిచూపారు. బడ్జెట్లో ఉపాధికి ఊతమిచ్చే ఎలాంటి ప్రతిపాదనలు లేవని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ విమర్శించింది.