న్యూఢిల్లీ : ప్యాకేజ్ ల కోసం ప్రైవేట్ దవాఖానాలు, హోటళ్లలో వ్యాక్సినేషన్ ను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించిన క్రమంలో కాషాయ పార్టీ ప్రతి విమర్శలకు దిగింది. ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతిపై బీజేపీ ఇవేతరహా ఆరోపణలు గుప్పించింది. వ్యాక్సినేషన్ పై ఓ ప్రైవేట్ దవాఖాన ముద్రించిన పోస్టర్ పై సోమ్ నాథ్ భారతి ఉన్న ఫోటోను బీజేపీ ట్వీట్ చేసింది. ఈ వ్యాక్సిన్ కు రూ 1000 వసూలు చేస్తున్నారని పేర్కొంది.
మరోవైపు బీజేపీ నేతలు కార్పొరేట్ ఆస్పత్రులు, హోటళ్లతో కుమ్మక్కయ్యారని అంతకుముందు ఆప్ ఎమ్మెల్యే అతిషి ఆరోపించడం కలకలం రేపింది. ఆయా ఆస్పత్రులు, ఫైవ్ స్టార్ హోటళ్లలో వ్యాక్సిన్ డోసులకు ఏకంగా రూ 1400 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాల్లో యువతకు ఉచితంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. ఇక రాష్ట్రాలకు వ్యాక్సిన్ నిల్వలు లేవని కేంద్రం చెబుతుంటే మరి ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ధరలకు వ్యాక్సినేషన్ ఎలా చేపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్రాన్ని నిలదీశారు.