గువహటి: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అస్సాం టీఎంపీ, ఆప్ శాఖలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి ఉదయ్పూర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తరచణ్ జైన్కు మద్దతుగా కటారియా ప్రచారం చేశారని టీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.
కొన్ని రోజుల క్రితం అస్సాం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్ మిజోరాంలో బీజేపీ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని… ఇప్పుడు కటారియా ఆ పని చేస్తున్నారని టీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి సవాల్ అని అస్సాం టీఎంసీ అధ్యక్షుడు రిపున్ బోరా ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘కటారియా రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఆయన చేసిన ప్రచారం గవర్నర్ పదవిని కించపరిచింది. భారత రాజకీయాల ప్రతిష్టను నాశనం చేసింది’ అని ఆప్ అస్సాం సమన్వయకర్త భాబెన్ చౌదరి విమర్శించారు.