న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 6న భారత్కు రానున్నారు. అధికారిక పర్యటన నిమిత్తం 6న న్యూఢిల్లీకి చేరుకోనున్న పుతిన్.. భారత్, రష్యా 21వ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఈసారి వార్షిక సదస్సు భారత ప్రధాని నరేంద్రమోదీ-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరుగనున్నది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ శుక్రవారం ఒక ప్రకటన చేశారు.
అయితే, ప్రధాని మోదీ- పుతిన్ సమావేశానికి ముందు రెండు దేశాల మధ్య 2+2 డైలాగ్ జరుగుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. రెండు దేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానుండగా.. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, రక్షణ మంత్రి సెర్గీ షోయిగు పాల్గొననున్నారు.