న్యూఢిల్లీ: ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా ఆఫర్ ఇచ్చింది. వేరే ఎవరైనా అయితే ఎగిరి గంతేసి దానికి ఒప్పుకొంటారు. అయితే మోదీ సర్కార్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. అమెరికా ఆంక్షలకు జడిసో, మరో కారణం చేతనో తమకు రష్యా ఎల్ఎన్జీ అవసరం లేదంటూ తెలిపింది. భారత ప్రయోజనాలను మోదీ అమెరికాకు ఎందుకు తాకట్టు పెడుతున్నారంటూ ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
రాయిటర్స్ కథనం ప్రకారం.. ఏప్రిల్ 30న రష్యా మంత్రి పావెల్ సోరోకిన్ న్యూఢిల్లీ సందర్శన సందర్భంగా మన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. తాము చవకగా ఇచ్చే ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాలంటూ ఆఫర్ ఇచ్చారు. రష్యా ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోలేమంటూ భారత్ తన నిస్సహాయతను తెలియజేసింది. దీంతో సోరోనిక్ జూన్లో మరోసారి భారత్ను సందర్శించి ఈ విషయమై చర్చలు కొనసాగిస్తారని తెలియవచ్చింది. భారత్ నిర్ణయం కారణంగా రష్యాకు చెందిన ఒక ఎల్ఎన్జీ నౌక భారత్కు రాకుండా సింగపూర్ సమీపంలో నిలిచిపోయింది.
భారత్ రష్యాకు అతి పెద్ద క్రూడ్ కొనుగోలుదారుగా ఉంది. అయితే ఎల్ఎన్జీ రవాణా కష్టతరం. ప్రపంచ వ్యాప్త ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఎల్ఎన్జీని దాచడం కష్టం. ప్రస్తుతం బాల్టిక్ సముద్రంలో ఉన్న రష్యాకు చెందిన పోట్రోవాయ ఎల్ఎన్జీ ప్లాంట్పై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చే కార్గోను స్వీకరించడానికి భారత్ నిరాకరించడంతో వాటిని రవాణా చేయడం సాధ్యపడలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.