హైదరాబాద్, ఏప్రిల్8 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే, రైతు నేత శంకరన్న దోండ్గే సమక్షంలో శనివారం గంగాఖేడ్ నియోజకవర్గం అంబేజోగైకి చెందిన ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం గంగాఖేడ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్ఞానోబా సాహెబ్గైక్వాడ్ ఇంటికి శంకరన్న స్వయంగా వెళ్లి సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా శంకరన్నను గైక్వాడ్ సన్మానించారు. గంగాఖేడ్ రైతు సంఘం నాయకులు భగవాన్రావ్ షిండే, పరాస్ షిండే, రామ్లటే, గణపత్రావ్ షిండే, శివాజీ కాంబ్లే బీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు. అనంతరం వారు శంకరన్నను సతరించారు.
రైతు కుటుంబానికి కదమ్ పరామర్శ
మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని బీఆర్ఎస్ కిసాన్ సెల్ నేతలు శనివారం పరామర్శించారు. వడ్లీ గ్రామానికి చెందిన రైతు నారాయణ్ దంగల్ పాటిల్ అప్పులబాధతో తన భార్య, కుమారుడికి విషమిచ్చి తానూ తాగాడు. ఈ ఘటనలో రైతు నారాయణ్ పాటిల్ మృతిచెందగా, ఆయన భార్య, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. బీఆర్ఎస్ కిసాన్ సెల్ మహారాష్ట్ర ప్రదేశ్ అధ్యక్షుడు మాణిక్రావు కదమ్, ఇతర నేతలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, భరోసా కల్పించారు.