బెంగళూరు, మే 3: కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టగా, తాజాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ(జేఏసీ) పిలుపునిచ్చింది.
కార్మిక సంఘాల నాయకులు, రవాణా మంత్రి రామలింగా రెడ్డి మధ్య ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో మే 20 ఉదయం 6 గంటల నుంచి కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ, ఎన్డ్ల్యూకేఆర్టీసీ, కేకేఆర్టీసీకి చెందిన బస్సులు నిలిచిపోనున్నాయి. కేఎస్ఆర్టీసీ సిబ్బంది, కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు జ్యోతి అనంత సుబ్బారావు శనివారం విలేకరుల సమావేశంలో సమ్మె నిర్ణయాన్ని ప్రకటించారు. 2024 జనవరి నుంచి 25 శాతం జీతం పెంపును తమ సంఘాలు డిమాండు చేసినట్లు ఆయన చెప్పారు. నిర్ణీత కాల వ్యవధిలో వేతన సవరణ అమలు చేయాలని మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.
అయితే ప్రభుత్వం కేవలం 7 శాతం పెంపును అది కూడా 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలుచేస్తామని ప్రతిపాదించిందని ఆయన చెప్పారు ఇది తమ కార్మికులకు ఆమోదనీయం కాదని సుబ్బారావు స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడినా రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, తమ సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం ఏర్పడితే దానికి ప్రభుత్వానిదే బాధ్యతే తప్ప ఉద్యోగులది కాదని సభ్యులు తెలిపారు.