హిజబ్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనుబంధ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం విచార్ మంచ్ కీలక ప్రకటన చేసింది. హిజబ్ అయినా, పర్దా అయిన భారతీయ సంస్కృతిలో భాగమేనని సంచలన ప్రకటన చేసింది. ఈ విషయంపై ఆరెస్సెస్ అనుబంధ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం మంచ్ నాయకుడు అనిల్ సింగ్ బీబీ ముస్కాన్ ఖాన్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఆమె మన సోదరి. ఇబ్బందుల్లో మనం ఆమెకు అండగా నిలబడాలి’ అంటూ వ్యాఖ్యానించారు. కర్నాటకలో బీబీ ముస్కాన్ ఖాన్ హిజబ్ ధరించి, కాలేజీకి వస్తున్న సమయంలో కొందరు యువకులు జై శ్రీరాం అంటూ ఆమెను అనుసరించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ ముస్లిం మంచ్ నాయకుడు అనిల్ సింగ్ పై విధంగా వ్యాఖ్యానించారు.
మహిళలను గౌరవించాలన్నదే హిందూ ధర్మం ఉద్దేశమని, జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ, ఆమెను భయపెట్టడం తప్పుడు విధానమని ఆయన అభ్యంతరం తెలిపారు. హిజబ్ ధరించే హక్కు ఆమెకు రాజ్యాంగం కల్పించిందని, ఒకవేళ విద్యా సంస్థల యాజమాన్యం నిర్దేశించిన యూనిఫాంకు వ్యతిరేకంగా వెళితే ఆమెపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు.అందరి డీఎన్ఏ ఒకటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ పదే పదే చెబుతుంటారని, సౌభ్రాతృత్వంగా మెలగాలని రాష్ట్రీయ ముస్లిం విచార్మంచ్ నేత అనిల్ సింగ్ అన్నారు.