న్యూఢిల్లీ: ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశను రూ. 7 వేల కోట్లతో ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ నిధులు కేటాయింపు చేస్తున్నట్టు తెలిపారు. న్యాయం కోరుకునే, తీర్పులను పొందాలనుకునే ప్రతి సామాన్యుడికి సైతం సమర్థవంతంగా, సమానంగా న్యాయవ్యవస్థ అందుబాటులో ఉండేలా ఇది ఉంటుందన్నారు.
దీనిలో భాగంగా కక్షిదారుడు కాని, న్యాయవాది కాని తమ కేసులకు సంబంధించి వివిధ కోర్టులకు తిరగనవసరం లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా, ఏ కోర్టులోనైనా కేసును దాఖలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ న్యాయశాఖ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఇటీవల న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని సూచనప్రాయంగా చెప్పారు.