వారణాసి, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన నమో ఘాట్కు ప్రవేశ రుసుం వసూలు చేయడంపై యూపీ అధికారులు వెనక్కు తగ్గారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు రావడంతో ఎంట్రీ ఫీజు నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. నమో ఘాట్గా పిలుస్తున్న ఖిడ్కియా ఘాట్ ప్రవేశానికి అధికారులు మంగళవారం నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. అక్కడ నమస్కారం పెడుతున్నట్టుగా చేతులు మాత్రమే ఉండే మూడు శిల్పాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంట్రీ ఫీజును ఉపసంహరించుకుంటున్నట్టు వారణాసి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పీఆర్వో శాఖంబరి తెలిపారు. ఎంట్రీ ఫీజు నిర్ణయంపై విపక్షాలు స్పందించాయి. ప్రధాని మోదీ నియోజకవర్గంలో ఘాట్లపై తిరగడానికి కూడా పన్నులు వేస్తున్నారని కాంగ్రెస్ నేత అజయ్రాయ్ విమర్శించారు.