ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌక కారణంగా ప్రపంచ వాణిజ్యం స్తంభించింది. ఈ నౌకను కదిలించేందుకు ఆదివారం మరో రెండు భారీ టగ్ బోట్లను మోహరించారు. ఇప్పటికే పది టగ్ బోట్లు నౌకను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కాగా, ప్రపంచ వాణిజ్యానికి జీవనాడిగా పిలిచే ‘సూయజ్’ కాలువలో ‘ఎవర్ గివెన్’ ఎలా చిక్కుకున్నది? దీని వల్ల కలిగే నష్టమేమిటి?
అసలేమిటి ఈ ‘ఎవర్ గివెన్’
జపాన్లోని ‘షోయి కిసెన్ కైసా’ సంస్థకు చెందిన భారీ సరుకు రవాణా నౌక పేరే ‘ఎవర్ గివెన్’. ప్రపంచంలో పొడవైన సరుకు రవాణా నౌకల్లో ఇది ఒకటి. దీని పొడవు 400 మీటర్లు, వెడల్పు 59 మీటర్లు, బరువు 2,19,076 టన్నులు. గంటకు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఘటన జరిగినప్పుడు నౌకలో దాదాపు 20 వేల కంటైనర్లతో పాటు 25 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరూ భారతీయులే. అయితే వాళ్లంతా సురక్షితంగా ఉన్నారు.
సమస్యకు కారణమేమిటి?
గత మంగళవారం సూయిజ్ కాలువ దక్షిణ ముఖం (ఎర్ర సముద్రం) నుంచి ఆరు కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ఇసుక తుపాను, తీవ్ర గాలుల ధాటికి ‘ఎవర్ గివెన్’ నియంత్రణ కోల్పోయి, కాలువకు అడ్డంగా తిరిగింది. నౌక ముందు భాగం కాలువ ఒడ్డున ఉన్న జిగురులాంటి ఇసుకలో కూరుకుపోయింది.
కోట్ల వ్యాపారంపై ప్రభావం
సూయజ్ కాలువలో ‘ఎవర్ గివెన్’ అడ్డంగా చిక్కుకుపోయి సోమవారానికి వారం కావొస్తుంది. దీనివల్ల దాదాపు 200కుపైగా నౌకలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో గడిచిన ఏడు రోజుల్లో రూ.4,86,528 కోట్ల వ్యాపారంపై ప్రభావం పడినట్టు అంచనా. వాహనాల విడిభాగాల సరఫరాలో ఆలస్యం వల్ల జర్మనీలోని కార్ల తయారీ పరిశ్రమలు, గ్యాస్ సరఫరాలో అంతరాయం వల్ల స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్పై ప్రభావం ఉండనుంది. అమెరికాపై కూడా పరోక్షంగా ప్రభావం పడనున్నది. పెట్రోలియం, ఉక్కు, ఎలక్ట్రానిక్స్ రవాణాపై కూడా ప్రభావం పడటం వల్ల వాటి ధరలు పెరుగొచ్చు.
పరిష్కార మార్గాలేంటి?
ప్రత్యామ్నాయంతో ప్రమాదం కూడా
సూయిజ్ కాలువలో రవాణా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ నౌకలు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇది అంత క్షేమకరంకాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం.. ఆఫ్రికా తీరంలోని సోమాలియాలో సముద్రదొంగలు ఉండటమే.
‘సూయజ్’కు అంత ప్రాధాన్యత ఎందుకు?
1850లో కంటే ముందు ఐరోపా, ఆసియాల మధ్య సరుకు రవాణా జరిపేందుకు ఆఫ్రికా చుట్టూరా సముద్ర మార్గంలో నౌకలు తిరిగి రావాల్సిన పరిస్థితులు ఉండేవి. దీనికి వ్యయం, సమయం ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చేది. దీనికి పరిష్కారాన్ని చూపిస్తూ మధ్యధరా సముద్రం, ఎర్రసముద్రాన్ని కలుపుతూ ఈజిప్టు వద్ద 193 కిలోమీటర్ల పొడవుతో 1859-69 మధ్య ‘సూయజ్ కాలువ’ పేరిట కీలక జలమార్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తక్కువ సమయం, వ్యయంతో సముద్ర మార్గాన సరుకు రవాణాకు వీలు కలిగింది. ఆసియా, ఐరోపా దేశాల మధ్య సరుకు రవాణా జరుగాలన్నా, అరబ్ దేశాల నుంచి చమురు ఐరోపా దేశాలకు, అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలన్నా ఈ కాలువే ఆధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో 15 శాతం ఈ కాలువ ద్వారానే జరుగుతున్నది. 30 % వాణిజ్య నౌకలు ఈ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి.
ఇవీ కూడా చదవండి..
కొత్త లుక్లో మారుతీ స్విఫ్ట్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
గెటప్ చూసి వంద రోజుల సినిమా అన్నారు..