Mukesh Dalal | హైదరాబాద్, ఏప్రిల్ 22 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి సౌరభ్ పార్ది సోమవారం అధికారిక ప్రకటన చేశారు. దలాల్ గెలుపును ఖరారు చేస్తూ సర్టిఫికెట్ను కూడా అందజేశారు. పోటీలో మరెవ్వరూ లేకపోవడంతోనే సర్టిఫికెట్ను జారీ చేసినట్టు వెల్లడించారు. 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓ బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలువడం ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా 2024 లోక్సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్లోని 26 స్థానాలకు మూడో దఫాలో మే 7న పోలింగ్ జరుగనున్నది. ఇందులో సూరత్ కూడా ఉన్నది. అయితే, ఇప్పుడు ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఆ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు.
బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, స్థానిక పార్టీలు, స్వతంత్రులతో కలిపి సూరత్ లోక్సభ బరిలో మొత్తం పది మంది నిలబడ్డారు. నామినేషన్ల విత్డ్రా చివరిరోజైన సోమవారం నాడు నలుగురు స్వతంత్రులు, మూడు స్థానిక పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు బీఎస్పీ నుంచి పోటీలో నిలబడ్డ ప్యారేలాల్ భారతి కూడా తన పేపర్స్ను విత్డ్రా చేసుకోవడం గమనార్హం. ఇక బరిలోని కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభని దాఖలు చేసిన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. కుంభనికి ప్రత్యామ్నాయంగా అదే కాంగ్రెస్ నుంచి నిలబడ్డ డమ్మీ అభ్యర్థి సురేశ్ పదసాలా దాఖలు చేసిన నామినేషన్ను కూడా చెల్లనిదిగా ప్రకటించారు. కుంభని, పదసాలా సమర్పించిన నామినేషన్లపై ప్రతిపాదకుల సంతకాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, నామినేషన్ దాఖలు సమయంలో ప్రతిపాదకులు హాజరు కూడా కాలేదని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. అందుకనే వాటిని తిరస్కరించినట్టు వెల్లడించారు. దీంతో బరిలో నిలిచిన ఏకైక అభ్యర్థి దలాల్ను విజేతగా ప్రకటించారు.
బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. భారత ఎన్నికల ప్రక్రియకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్నో మ్యాచ్ ఫిక్సింగ్గా అభివర్ణించారు. చివరి రోజున అనూహ్యంగా అందరూ బరిలో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం కుట్రగా కనిపిస్తున్నదని సోషల్మీడియాలో పలువురు కామెంట్లు పెట్టారు.
ప్రజాప్రతినిధులు ఏకగ్రీవమవ్వడమనేది గతంలో కూడా జరిగింది. 1951ఎన్నికల నుంచి ఇప్పటివరకూ 35 మంది ఎంపీలు, 298 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవమయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. జమ్ముకశ్మీర్ నుంచి అత్యధికంగా నలుగురు ఎంపీలు, నాగాలాండ్ నుంచి ఏకంగా 77 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవమయ్యారు. ఎంపీగా ఏకగ్రీవమైన వారిలో మాజీ ఉప ప్రధాని వైబీ చవాన్ (నాసిక్), ఫరూఖ్ అబ్దుల్లా (శ్రీనగర్), టీటీ కృష్ణమాచారి (తిరుచెందూర్), మాజీ కేంద్రమంత్రులు పీఎం సయీద్ (లక్షద్వీప్), కేఎల్ రావు (విజయవాడ), ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ (కన్నౌజ్) వంటి ప్రముఖులు ఉన్నారు.