జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు ధర నిర్ణయించడంలో జాప్యం, తక్కువ ధర నిర్ణయించడంతో ఈనెల 10న అన్నదాతలు ఆందోళనబాట పట్టారు. మూడు గంటలపాటు మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. చివరికి అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ రైతులతో చర్చించి శాంతింపజేశారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాదేశాలకు భిన్నంగా క్వింటాలుకు రూ. 600 తక్కువతో కొనుగోళ్లకు సిద్ధపడిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని ఆదేశించారు.
జనగామ, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : జనగామ మార్కెట్యార్డులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలివి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలు ఏమాత్రం పనిచేయడం లేదని, చర్యలు తీసుకుంటామంటూ చేస్తున్న హెచ్చరికలు సైతం ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయని చెప్పేందుకు ఇవి అద్దం పడుతున్నాయి. ధాన్యం అమ్ముకొనేందుకు అన్నదాతలు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రైస్ మిల్లర్లు, వ్యాపారులు, దళారులు, చిల్లరకాంట నిర్వాహకులు ఎవరికి తోచిన విధంగా వారు రైతులను దోచుకుంటున్నారు. కొనుగోళ్లు లేక, కొన్నా మద్దతు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రమకు తగిన ఫలితం లేక ఉసూరుమంటున్నారు. జనగామ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడం జిల్లాలోని మిల్లర్లకు వరంలా మారింది. 12 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు నేరుగా మిల్లుల్లోకి వెళ్లి తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో మద్దతు ధరకు మాత్రమే కొనాలన్న నిబంధన పెట్టిన జిల్లా అధికార యంత్రాంగం కండ్లు మూసుకున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తూకంలో మోసం.. ధరలో దగా
మిల్లుల్లో కొనుగోళ్లపై అధికారికంగా ఎలాంటి రికార్డులు ఉండవు. తక్పట్టీ ఇవ్వరు. తెల్ల కాగితంపై అంకెలు, సంఖ్యలు తప్ప అమ్మినట్టు, కొన్నట్టు ఎలాంటి ఆధారం లేకుండా కొనుగోళ్లలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మద్దతు ధర రూ.2200 చెల్లించాల్సిన మిల్లర్లు క్వింటాలుకు రూ.1800 నుంచి రూ.1900 మించి కొనడంలేదు. మార్కెట్ ట్రేడ్ లైసెన్స్ ఉన్నప్పటికీ యార్డుకు వచ్చి కొనని వ్యాపారులు బయట ఇష్టారాజ్యంగా కొంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడుకు 35 కిలోల చొప్పున బాదుతున్న మిల్లర్లు ధాన్యం తరుగు పేరిట బస్తాకు మరో 2 కిలోల కోత విధిస్తున్నారు. కూలీల ఖర్చుల కింద బస్తాకు రూ.10, అమ్ముకున్న వెంటనే డబ్బులు కావాలంటే రూ.2 చొప్పున కమీషన్ కట్చేసి చెక్ రాసి ఇస్తున్నారు. మార్కెట్లో కొంటే క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డు చూపాల్సి ఉంటుంది. అదే చిల్లర కాంటాలు, మిల్లుల్లో కొనుగోలు చేస్తే ఇలాంటివి అవసరం లేదు కాబట్టే అటు మిల్లుల్లోనూ, ఇటు బయట చిల్లర కాంటా వ్యాపారుల వద్ద కూడా ఇదే రకమైన దోపిడీ కొనసాగుతున్నది.
రైతుల సొమ్ము రియల్ ఎస్టేట్లోకి
జనగామ జిల్లాలో రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) బియ్యాన్ని ప్రభుత్వానికి నిర్దేశించిన గడువులో తిరిగి ఇవ్వకుండా బయట అమ్ముకొని వ్యాపారాలకు సొమ్ము మళ్లిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసిన జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు బయటి మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటే, ఇంకొందరు బియ్యానికి అధిక ధర పలికే ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. అక్కడ తక్కువ ధరకు లభించే బియ్యాన్ని ఇక్కడకు తీసుకొచ్చి సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి పెడుతున్నట్టు తెలిసింది. జిల్లాలో రైస్ మిల్లర్లు 54,225 టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఇచ్చింది 22,142 మెట్రిక్ టన్నులు (సుమారు 40శాతం) మాత్రమే. అంటే ఇంకా మిల్లర్లు బకాయి పడ్డది 32,083 టన్నులు(60శాతం). ఈ ఏడాది ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని వచ్చే ఏడాది వరకు ఇవ్వకుండా బకాయి పెట్టి, ముందుగానే అమ్ముకుంటూ వచ్చిన సొమ్మును రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలకు పెట్టుబడి పెట్టడం లేదా వడ్డీ వ్యాపారం చేస్తూ ఏడాది ప్రజల సొమ్ము అప్పనంగా వాడుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి.
జనగామ వ్యవసాయ మార్కెట్లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించిన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్ రోహిత్సింగ్ గారికి నా అభినందనలు
-సీఎం రేవంత్రెడ్డి (ఏప్రిల్ 11)
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలి. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్న్సలు రద్దు చేస్తాం. కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెడతాం.
-సీఎం రేవంత్రెడ్డి (ఏప్రిల్ 12)
సీఎం హెచ్చరికలతో ఆ తర్వాతి రోజున జనగామ మార్కెట్లో వ్యాపారులు క్వింటాలుకు రూ. 30 మాత్రమే పెంచారు. అప్పటి వరకు మద్దతు ధర రూ. 2,200కు బదులు రూ. 1,530 మాత్రమే ముట్టజెప్పిన వ్యాపారులు దానికి మరో రూ. 30 కలిపి కొనుగోలు చేశారు.