న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తన రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమేథీ నుంచి పోటీ చేస్తారా? అని ఓ విలేకరి శనివారం అడిగినపుడు ఆయన బదులిస్తూ, తాను క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించడానికి దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో మద్దతు ఉందన్నారు.
తాను ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటున్నానని చెప్పారు. తాను అక్కడ (అమేథీలో) 1999 నుంచి ప్రచారం చేస్తున్నానని, ఆ ప్రాంతంలో తాను ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీపై వాద్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు.