హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రహదారుల నిర్మాణంతోనే కశ్మీర్ సమగ్రాభివృద్ధి సాధ్యమని కేంద్ర జాతీయ రహదారుల, రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్వ్యాలీలో రూ.లక్ష కోట్లతో ఆరు కీలక రహదారుల ప్రాజెక్టులను చేపట్టినట్టు వివరించారు. జడ్మోర్-సోనామార్గ్-లేహ్ లఢక్ మధ్య నిర్మిస్తున్న జడ్మోర్, జొజిలా సొరంగమార్గాలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. రవాణా సదుపాయాలు సక్రమంగా లేకపోవడం, ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే రాకపోకల వల్ల జమ్ముకశ్మీర్ అభివృద్ధి చెందడం లేదని చెప్పారు. చలికాలంలో రోడ్లన్నీ మంచుతో మూసుకుపోవడం వల్ల స్థానిక ప్రజలతోపాటు, రక్షణ బలగాలకు ఆహారం, ఇతర వస్తువులను అందించడం కష్టతరంగా మారిపోయిందని వివరించారు. జొజిలా, జడ్మోర్ సొరంగమార్గాలు కశ్మీర్ సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
మేఘా సంస్థకు ప్రశంసలు
జొజిలా సొరంగమార్గాన్ని నిర్మిస్తున్న మేఘా ఇంజినీరింగ్ ఇఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)పై గడ్కరీ ప్రశంసలు కురిపించారు. కంపెనీ నిర్మాణ సామర్థ్యం, నైపుణ్యాలకు పోలవరం ప్రాజెక్టు నిదర్శనమని చెప్పారు. అదే తరహాలో సొరంగమార్గాన్ని కూడా నాణ్యతలో రాజీలేకుండా, అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నదని కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డిని అభినందించారు. సొరంగమార్గాన్ని 2026లో పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, 2023 డిసెంబర్ నాటికి సిద్ధం చేసేందుకు కృషిచేయాలని సూచించారు. అందుకు కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు.