Road Accident | చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం ‘చితి’కిపోయింది. భార్యాభర్తలు సహా ముగ్గురు పిల్లలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన హర్యానా జింద్లో మంగళవారం చోటు చేసుకున్నది. మృతులను హిస్సార్ జిల్లా బార్వాలా బ్లాక్ ఖర్కడా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పానిపట్లోని ఖర్కడ గ్రామానికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి మామ ఇటీవల చనిపోయాడు. దాంతో అతను భార్య, నలుగురు పిల్లలతో కలిసి రసూల్పూర్ గ్రామానికి వెళ్లాడు.
మంగళవారం ద్విచక్ర వాహనంపై భార్యా పిల్లలతో కలిసి ఖర్కడ గ్రామానికి తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో జింద్ నగరానికి చేరుకోబోతున్నామనగా ఓ టక్కు బైక్ను ఢీకొట్టింది. దీంతో అందరూ రోడ్డుపై పడిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురి అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఎనిమిదేళ్ల షీరత్ అనే బాలిక క్షేమంగానే ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.