Road Accident | బైశాఖి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పంజాబ్ హోషియార్పూర్ జిల్లా ఖురల్గఢ్ సాహిబ్కు వెళ్తున్న సమయంలో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. మృతులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారని గర్శంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ దల్జీత్ సింగ్ పేర్కొన్నారు. యూపీ ముజఫర్నగర్ జిల్లా మస్తాన్ ఖేరాకు చెందిన భక్తులు బైశాఖి వేడుకలు జరుపుకునేందుకు వెళ్తున్న సమయంలో ఖురల్గఢ్ సాహిబ్కు కాలినడకన వెళ్తున్నారు.
కొండ ప్రాంతం వద్ద వాలుగా ఉన్న ప్రాంతంలో అటుగా వస్తున్న లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. పాదయాత్రగా వెళ్తున్న 17 మందికిపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి గాయలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. పీజీఐఎంఈఆర్ చండీగఢ్కు తరలించగా.. మిగతా వారిని గఢ్శంకర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు బ్రేక్లు ఫెయిల్ అయ్యాయని, దాంతో వాహనం అదుపు తప్పిందని డీఎస్పీ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.