Road Accident | ముంబై : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ – ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మృతులను సవితా శ్యామ్ భాలేరావు(25), ప్రీతి పరమేశ్వర్ భాలేరావు(8), సుశీల్ మరోటి గైక్వాడ్(9), రేఖాబాయి పరమేశ్వర్ భాలేరావు(30), అంజనాబాయి జ్ఞానేశ్వర్ భాలేరావు (28)గా గుర్తించారు. మృతులు నాందేడ్లోని భోకర్ తాలూకాలోని రేనాపూర్ గ్రామానికి చెందినవారు. భాలేరావు కుటుంబం నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో నివసిస్తున్నారు. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకల నిమిత్తం వారు భోకర్కు వచ్చారు. పుట్టినరోజు ముగిశాక గురువారం రాత్రి నవీపేట్ వెళ్తుండగా వారి కారు ప్రమాదానికి గురైంది.