Lalu Prasad Yadav | పాట్నా, మార్చి 3: ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువే కాదని, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు. మోదీకి కుటుంబం లేదని, అందుకే ఆయన వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని అన్నారు.
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ఆర్జేడీ ఆదివారం ‘జన ఆశీర్వాద్ ర్యాలీ’ పేరుతో భారీ సభ నిర్వహించింది. ఈ సభకు ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. తల్లి మరణం తర్వాత ప్రతి ఒక్క హిందూ గుండు చేయించుకొంటారని, అయితే మోదీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని లాలూ ఆరోపించారు.