Rice Prices | న్యూఢిల్లీ: పండుగల వేళ దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కూరగాయలు, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితుల్లో బియ్యం ధరలు పెరుగుతుండటం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కేవలం వారం రోజుల్లో దేశంలో బియ్యం ధరలు దాదాపు 10-15 శాతం వరకు పెరిగాయి. బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ప్రపంచ బియ్యం మార్కెట్లో భారత్ వాటా 45 శాతం వరకు ఉంటుంది. భారత్ నుంచి ప్రధానంగా ఇరాన్, సౌదీ అరేబియా, చైనా, యూఏఈ, ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి అవుతుంది. అయితే, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతులపై కేంద్రం గత ఏడాది ఆంక్షలు విధించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 20 శాతానికి పెంచింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగించడంతో పాటు పారాబాయిల్డ్ బియ్యంపై సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ సెప్టెంబర్ 28న కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కేంద్రం నిర్ణయంతో భారత్ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు జోరందుకున్నాయి. దీంతో దేశంలో వారం వ్యవధిలోనే బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆఫ్రికాకు ఎక్కువగా ఎగుమతయ్యే స్వర్ణ రకం బియ్యం ఇంతకుముందు రూ.35 కిలో ఉండగా ఇప్పుడు రూ.41కి పెరిగింది. బాస్మతి బియ్యం మినహా మిగతా అన్ని రకాల బియ్యం ధరలు 10-15 శాతం పెరిగాయని బియ్యం ఎగుమతిదారులు చెప్తున్నారు.