ఇంఫాల్: మణిపూర్లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పశ్చిమ ఇంఫాల్, కాంగ్పోక్పీ జిల్లాల్లో జరిగిన హింసలో ఒక పౌరుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. తెల్లవారుజామున ఫయెంగ్, సింగ్డా గ్రామంలో స్వల్ప కాల్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఉద్రిక్తతల కారణంగా ఇంఫాల్లో వాణిజ్య సముదాయాలు మూసివేశారు.
సుప్రీంకోర్టు భద్రతను చేపట్టలేదు
మణిపూర్ అల్లర్లపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ తమ బాధ్యత కాదని, అయితే వాటిని పర్యవేక్షిస్తామని పిటిషనర్కు తెలిపింది. శాంతి భద్రతలు మెరుగుపరచడానికి తగిన సూచనలు ఇవ్వాలని అతడిని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితిపై బీరేన్ సర్కారు సమర్పించిన నివేదికను పరిశీలించింది. ఇప్పటి వరకు అల్లర్లలో 142 మంది చనిపోయారని, 5995 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
నిజ నిర్ధారణ కమిటీపై ఎఫ్ఐఆర్
మణిపూర్ అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ప్రకటించిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై ఈ నెల 8న ఇంఫాల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధ ప్రకటన, రెచ్చగొట్టడం, పరువు నష్టం తదితర అభియోగాలతో ఈ కేస్ నమోదు చేశారు. మరోవైపు జోమి స్టూడెంట్స్ ఫెడరేషన్, కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హోం శాఖ డీజీపీకి లేఖ రాసింది. జాతుల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం విభజన వాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తూ బుక్లెట్ ప్రచురించినందుకు ఆ సంఘాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన అడ్డంకి
మణిపూర్లో శాంతి స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన అడ్డంకి అని వామపక్షాలు ఆరోపించాయి. సీపీఐ, సీపీఎం ఎంపీలు ఇటీవల రాష్ట్రంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. సమస్య పట్ల ప్రధాని మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రజలను బాధిస్తున్నదని వారు తెలిపారు.