Patna | బీజేపీ, జేడీయూ మధ్య మిత్ర వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ ట్వీట్ చేస్తూ… పెద్ద పార్టీల పాలనా శైలిని చిన్న పార్టీలకు ఏమాత్రం అర్థం కాదని విమర్శించారు. వారసలు పెద్ద పార్టీకి చెందిన వారో, చిన్న పార్టీకి చెందిన వారో అన్న విషయంలో వారికే స్పష్టత ఉండదు. అతి త్వరలోనే వారు కొత్త పంథాను వెతుక్కొనే రోజులు రావొచ్చు. అంటూ నిఖిల్ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, చురకలంటించారు.
బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలకు జేడీయూ కౌంటర్ ఇచ్చింది. జేడీయూ అధికార ప్రతినిధి అభిషేక్ ఝా మాట్లాడుతూ.. ఆయా నేతలు తమ తమ స్థాయిని దృష్టిలో ఉంచుకొని ప్రకటనలు చేస్తే బాగుంటుంది. ఆకాశం మీద ఉమ్మి వేయాలని చూస్తారు. చివరికి అది మన మీదే వచ్చి పడుతుంది. త్వరగా దానిని శుభ్రం చేయండి. దేవుడు సహకరిస్తాడు అంటూ అభిషేక్ ఝా కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ, జేడీయూ మధ్య మరో అంశంలోనూ భేదాభిప్రాయాలు పొడసూపాయి. ప్రముఖ నాటక రచయిత దయా ప్రకాశ్ సిన్హా అశోకుడి విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనకిచ్చిత పద్మశ్రీ బిరుదును కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. దీనిపై బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తీవ్రంగా మండిపడ్డారు. దయా ప్రకాశ్ సింగ్ను వెంటనే అరెస్ట్ చేయాల్సింది పోయి, ప్రధానికి లేఖ రాయడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి దానికీ ఆయన్ను లాగడమేంటని ఆగ్రహం వ్యక్త చేశారు. మరోసారి ఇలా చేస్తే రాష్ట్రంలో 76 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం ఇవ్వడానికి రెడీగానే ఉన్నామని జైస్వాల్ హెచ్చరించారు.
బీజేపీ అధ్యక్షుడు చేసిన కామెంట్స్పై జేడీయూ స్పందించింది. దయా ప్రకాశ్ సింగ్ విషయంలో తమ విధానాన్ని మార్చుకోబోమని జేడీయూ నేత ఉపేంద్ర కుశ్వాహా తేల్చి చెప్పారు. ఆయనికిచ్చిన అవార్డును వెనక్కి తీసుకోవాల్సిందేనని కుశ్వాహా తేల్చి చెప్పారు.