న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రధానంగా ప్యాసెంజర్ రైళ్లలో ప్రయాణాలు సాగించే చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలకు చార్జీల విషయంలో ఊరట కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది. ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా మార్చిన ప్యాసెంజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలను గతంలో ఉన్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.
మంగళవారం ఉదయం నుంచే పాత ఆర్డినరీ చార్జీలు అమల్లోకి వచ్చాయి. కొవిడ్ లాక్డౌన్ తర్వాత రైల్వే శాఖ పేర్లను మార్చడం ద్వారా ప్యాసెంజర్ రైళ్లను క్రమంగా ఉపసంహరించింది. దీంతో ఆర్డినరీ క్లాస్లో కనీస చార్జి ఎక్స్ప్రెస్ రైళ్ల ధరలకు సమానంగా రూ.10 నుంచి రూ.30లకు చేర్చడంపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. సమీక్షా సమావేశం నిర్వహించిన రైల్వే బోర్డు.. సెకండ్ క్లాస్ ఆర్డినరీ కనీస చార్జీలను పాత విధానంలోనే వసూలు చేయాలని చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ సూపర్వైజర్లకు సమాచారం అందజేసింది. దీని ప్రకారం ‘మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్’ (మెమూ) రైళ్ల ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరలు 50 శాతం వరకు తగ్గాయి. యూటీఎస్ యాప్లోనూ కొత్త ఈ చార్జీలను అప్డేట్ చేశారు.