మీరేం ఆలోచించాలో అదే చెప్తుంది మీరేం ఇష్టపడాలో అదే చెప్తుంది మీరేం లైక్ కొట్టాలో అదే చెప్తుంది మనసును మాయ మంచు పొగలతో కమ్మేస్తుంది! మంత్రమేసి, మరుగుమందు పెట్టినట్టు లొంగదీస్తుంది!!మీకు సంబంధం లేకుండానే మీ మెదడును నియంత్రిస్తుంది! మీకు తెలియకుండానే మీ అభిప్రాయాన్ని చెప్పేస్తుంది!! చివరగా అది చెప్పిందే మీరు చేసేస్తారు అది అనుకొన్నదే మీరు ఆలోచిస్తారు అదే ‘టెక్ ఫాగ్’.. బీజేపీ వాడుతున్న సోషల్ వేగు
విద్వేష ప్రచారం కోసం బీజేపీ ఐటీ సెల్ ‘టెక్ ఫాగ్’ యాప్ను ఉపయోగిస్తున్నది. ఆ యాప్తో ఫేక్ ట్రెండింగ్లు సృష్టించి, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నది. పార్టీని విమర్శించే జర్నలిస్టులు, రాజకీయ నేతలు తదితరుల వ్యక్తిగత వివరాలను సేకరించి వేధింపులకు పాల్పడుతున్నది. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. బీజేపీ ఐటీ సెల్లో పనిచేసిన వ్యక్తే. దీన్ని బీజేపీ ఐటీ సెల్ ఒక్కటే కాకుండా, భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కూడా వాడుతున్నదని పేర్కొన్నారు. ఈ సోర్స్ చెప్పింది.. నిజమా.. కాదా.. అన్నదానిపై డిజిటల్ మీడియా సంస్థ ‘వైర్’ రెండేండ్ల పాటు పరిశోధన చేసి నిజమేనని తేల్చింది. బీజేపీ ఐటీ సెల్ ద్వారా ఎలా విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నదీ.. ప్రజల మనసుల్లో ఎలా విషాన్ని ఎక్కిస్తున్నదీ.. ఐటీ సెల్లో పనిచేస్తున్న ఆర్తి శర్మ08 (ట్విట్టర్ ఖాతా పేరు) ప్రపంచానికి తెలియజేశారు. ఐటీ సెల్ పనితీరును విమర్శిస్తూ 2020 ఏప్రిల్ నెలలో వరుస ట్వీట్లు చేశారు. ఈ క్రమంలోనే ‘టెక్ ఫాగ్’ యాప్ పేరును వెల్లడించారు. ‘2014 నుంచి నేను బీజేపీ ఐటీ సెల్లో పనిచేస్తున్నాను. బీజేపీ ఐటీ సెల్ కోసం ఎన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయి. నేను ‘టెక్ ఫాగ్’ అనే యాప్ను వాడాను. ఈ యాప్ కేవలం ఐటీ సెల్ వాళ్లకే. ఇది సెక్యూరిటీ ఫీచర్స్ను దాటుకొని సందేశాలు పంపుతుంది. హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేస్తుంది. దీంతోపాటు ఐటీ సెల్ వర్కర్లు టాస్కర్ అనే యాప్ను కూడా వాడుతున్నారు’ అని ఆర్తి శర్మ08 తన ట్వీట్లలో పేర్కొన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే ఐటీ సెల్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇప్పుడు లేవంటున్నారని ఆరోపించారు.
అసలేమిటీ టెక్ ఫాగ్
ఇదొక అత్యాధునిక యాప్. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఖాతాలతో సంబంధం లేకుండా టెక్ ఫాగ్ యాప్ సొంతంగా ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాలు క్రియేట్ చేస్తుంది. రీట్వీట్లు, ఫేస్బుక్లో పోస్టులను ఆటోమేటిక్గా షేర్ చేస్తుంది. ముందుగా టైప్ చేసి పెట్టిన సందేశాలతో ఆటోమేటిక్గా రిైప్లెలు ఇస్తుంది. క్రియాశీలకంగా లేని వాట్సాప్ నంబర్లను హైజాక్ చేస్తుంది. టోకెన్ థెఫ్ట్ అనే సాంకేతికత ద్వారా ఆ నంబర్ల నుంచి సందేశాలు పంపిస్తుంది.
ఎలా పని చేస్తుంది?
క్రియాశీలకంగా లేని వాట్సాప్ నెంబర్లను టెక్ఫాగ్ యాప్ గుర్తిస్తుంది. 67 మంది యాప్ ఆపరేటర్లు ఎలా వాట్సాప్ నెంబర్ల నుంచి సందేశాలు పంపిస్తున్నారో ఆర్తి స్క్రీన్ షాట్లు పంపించారు. భవిష్యత్తులో ట్రోలింగ్ చేసేందుకు వీలుగా వీరి ఫోన్ల ఆధారంగా వ్యక్తిగత వివరాలను కూడా సేకరించి పెట్టుకొన్నారు. దీనిని వైర్ సంస్థ ‘వాట్సాప్ ఎక్స్ప్లాయిట్’తో ధ్రువీకరించుకొన్నది. ప్రజల వృత్తి, మతం, భాష, వయస్సు, రాజకీయ ఆలోచన విధానం తదితర అంశాల ఆధారంగా టెక్ ఫాగ్ ఆపరేటర్లు యాప్లో డాటాబేస్ క్రియేట్చేశారు. ఉదాహరణకు బీజేపీ గొప్పతనాన్ని ప్రచారం చేయాలంటే యాప్లో బీజేపీ అనుకూల గ్రూపుల్లో సందేశం పెడితే అక్కడి నుంచి లక్షలాది ఖాతాల్లోకి ఆ సందేశం వెళ్లిపోతుంది. ఏదైనా గ్రూపును కించపర్చాలంటే కూడా అంతే. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆర్తి పంపించారు. దీనిని వైర్ సంస్థ ఓ మహిళా జర్నలిస్టు గ్రూపునకు వచ్చిన రిైప్లెలను బట్టి ధ్రువీకరించింది. సందేశాలు రావడం గమనించింది.
టెక్ ఫాగ్తో బీజేపీ ఐటీ సెల్ ఏం చేస్తుంది?
టెక్ఫాగ్పై పనిచేసేవారికి ఐటీ సెల్లో రోజు వారీ టాస్కులు ఇస్తారు. దేన్ని ట్రెండింగ్ చేయాలో, ఎవరిని టార్గెట్ చేసుకోవాలో చెప్తారు. వాటి ఆధారంగా ఐటీ సెల్లో పనిచేసేవారు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను సృష్టిస్తారు. సొంతంగా ప్రచారానికి గానీ, ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని గానీ హ్యాష్ట్యాగ్లు రూపొందిస్తారు. బీజేపీకే చెందిన విభిన్న రకాల వాట్సాప్ గ్రూపులు సృష్టించి నిర్వహిస్తారు. ఇదంతా టెక్ ఫాగ్ యాప్ ద్వారా జరుగుతుంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్
2020 మే 4న రాత్రి 8.25 గంటలకు #CongressAgainstLabourers హ్యాష్ట్యాగ్ స్క్రీన్ షాట్ను ఆర్తి శర్మ వైర్ జర్నలిస్టులకు పంపించారు. దాన్ని ట్రెండ్ చేయాలని తమకు డైలీ టాస్క్లో భాగంగా ఇచ్చినట్టు చెప్పారు. ఆ హ్యాష్ ట్యాగ్తో 55వేల ట్వీట్లు చేయాలి. హ్యాష్ట్యాగ్ను ట్రెండింగ్లోకి తీసుకెళ్లాలి. ఆర్తి చెప్పింది నిజమేనని వైర్ సంస్థ సోషల్ మీడియా అనాలిసిస్ టూల్తో ధ్రువీకరించుకొన్నది. ఆర్తి పంపిన స్క్రీన్షాట్లోని హ్యాష్ ట్యాగ్ అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ట్వీట్ చేశారు. 3 గంటల్లోనే అది ట్రెండింగ్లోకి వెళ్లింది. 57వేల మంది ఆ హ్యాష్ట్యాగ్ను వాడారు. ఆర్తి ఏదైతే స్క్రీన్ షాట్ పంపించారో అదే తరహాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇలాంటి మరికొన్ని హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లను(మర్కజ్, ఢిల్లీ అల్లర్లు) కూడా వైర్ సంస్థ నిర్ధారించుకొన్నది.
యాప్ డిజైన్ చేసింది పెర్సిస్టెన్స్ సిస్టమ్స్?
సాలరీ స్టేట్మెంట్ను బట్టి ఆర్తి శర్మ పెర్సిస్టెన్స్ సిస్టమ్ అనే సాంకేతిక సేవల సంస్థలో అసైన్డ్ క్లయింట్గా మొహల్లా టెక్ సంస్థ కోసం పనిచేస్తున్నారు. వాస్తవానికి ఆర్తి పనిచేస్తున్నది బీజేపీ ఐటీసెల్లో. పెర్సిస్టెన్స్ సంస్థ తనను సోషల్ మీడియా ఇంచార్జిగా విధుల్లోకి తీసుకొన్నట్టు ఆర్తి శర్మ వెల్లడించారు. దీంతో పెర్సిస్టెన్స్ సంస్థనే ఈ యాప్ను క్రియేట్ చేసినట్టు అనుమానాలు ఉన్నాయి. దీనిపై పూర్తిగా స్పష్టత రాకపోయినా.. దీన్ని బలపరిచే ఆధారాలు వైర్కు లభించాయి. ప్రస్తుతం పెర్సిస్టెన్స్ కంపెనీలోనే పనిచేస్తున్న ఓ ఉద్యోగిని వైర్ సంప్రదించింది. అతడు కంపెనీ మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్(అంతర్గతంగానే వాడతారు) స్క్రీన్ షాట్లను పంపించాడు. దీంట్లో టెక్ ఫాగ్ పేరుతో 17,000 డాక్యుమెంట్లు కనిపించాయి. ఇవి యాప్ తయారీలో వివిధ దశలను తెలుపుతున్నాయి.
డిజిటల్ డాటా హబ్ కాంట్రాక్టు ఆ సంస్థకే!
2015 నుంచి పెర్సిస్టెన్స్ సిస్టమ్ ప్రభుత్వ కాంట్రాక్టులపై ఎక్కువగా పనిచేస్తున్నది. 2018లో కేంద్రం నుంచి పెర్సిస్టెన్స్ సిస్టమ్స్కు భారీ కాంట్రాక్టు లభించింది. దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఒకే చోట నిల్వ చేయడానికి డిజిటల్ డాటా హబ్ నిర్మాణ కాంట్రాక్టు వచ్చింది.
రెండేండ్ల పరిశోధన
ఆర్తి శర్మ ట్వీట్ల ఆధారంగానే టెక్ ఫాగ్పై వైర్ సంస్థ పరిశోధనకు బీజం పడింది. సంస్థకు చెందిన జర్నలిస్టులు ఆయుష్మాన్ కౌల్, దేవేశ్ కుమార్ ‘ఆర్తి శర్మ08’(సోర్స్)తో మాట్లాడి వివరాలను సేకరించారు. ఆర్తి శర్మ టెక్ ఫాగ్పై పనిచేస్తూ ఆ స్క్రీన్ షాట్లను వైర్కు పంపించారు. వీటిని వైర్ సంస్థ వేరే మాధ్యమాల ద్వారా నిర్ధారించుకొన్నది.