Ladakh | లఢక్, మార్చి 28: కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని లఢక్వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటి శక్తుల ప్రభావంతో తాము గిరిజన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని.. అధికార వికేంద్రీకరణ జరిపి రాజ్యాంగ రక్షణలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం లఢక్ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ ఇటీవల 21 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతున్నది. మార్చి 6న అంతర్గత మంత్రిత్వ శాఖతో జరిపిన తాజా చర్చలు ఫలించకపోవడంతో వందలాది మంది ఇటీవల లేహ్లో గుమిగూడి నిరసన తెలిపారు. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం గిరిజన హోదా కలిగిన లఢక్కు రాష్ట్ర హోదా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాసన, న్యాయ, పరిపాలన విభాగాలు ఏర్పాటు చేసి జనాభాలో 97 శాతం గిరిజనులు ఉన్న తమ ప్రాంతంలో కీలకమైన భూమి, అడవులు, నీరు, మైనింగ్ వంటి అంశాలపై ఆ విభాగాలు చట్టాలు చేసే అధికారం కల్పించాలని వారు కోరుతున్నారు.
భూములు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు
లఢక్లో బౌద్ధుల జనాభా అధికం. అయితే తమ ప్రాంతం పట్ల కశ్మీర్ ఆధారిత నాయకత్వం వివక్ష చూపుతున్నదన్నది స్థానికుల ఆరోపణ. పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయ ప్రాంతాన్ని సైనికీకరణ చేయడం, అభివృద్ధి ప్రాజెక్టులలో భాగస్వామ్యం లేకపోవడం, ఈ ప్రాంతాన్ని న్యూఢిల్లీ నుంచి నేరుగా నడపాలన్న నిర్ణయం స్థానికుల్లో ఆందోళనలను రేకెత్తించింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య గత మూడేళ్లలో నిర్మించిన రహదారులు, వంతెనలు వంటి సైనిక అవసరాల కోసం సేకరించిన భూములు కోల్పోయిన స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుత ఒప్పందం ప్రకారం, లఢక్ ప్రజలు గతంలో కంటే తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. బయటి వ్యక్తులు ఈ ప్రాంతంలో స్థిరపడటానికి, వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త చట్టాలు అనుమతించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీని వల్ల పర్యావరణానికి హాని జరగడంతో పాటు తమ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. బోరాక్స్, బంగారం, గ్రానైట్, సున్నపురాయి, పాలరాతి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఏడు జల విద్యుత్తు ప్రాజెక్టులు, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం పట్ల ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రజాస్వామ్యం లేని అభివృద్ధి వద్దు
ప్రజలకు అభివృద్ధి ప్రాజెక్టులు కొంత సౌలభ్యాన్ని కలిగిస్తాయని, కానీ ఈ రకమైన అభివృద్ధిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని వాంగ్ చుక్ అన్నారు. ప్రజాస్వామ్యం లేకుండా అభివృద్ధితో ఉపయోగం ఏమిటని ప్రశ్నించిన ఆయన, కేవలం లాభాలపైనే ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలకు లఢక్ ఆటస్థలంగా మారుతున్నదని విమర్శించారు. వారికి భవిష్యత్తుపై గానీ, స్థానిక ప్రజలపై గానీ ఆసక్తి ఉండదన్నారు. కానీ ఆర్టికల్ 370 రద్దు, దానికి సంబంధించిన చర్యలే అంతిమమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.