అహ్మదాబాద్, జూన్ 15: గుజరాత్లో 4వేల మంది ప్రభుత్వ రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తాము కొవిడ్ కాలంలో వైద్య సేవలందించిన ఏడాదిన్నర కాలాన్ని ‘బాండ్ సర్వీస్’ కింద పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా, ఐదు కాలేజీలకు చెందిన రెసిడెంట్ వైద్యులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గుజరాత్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ చేసిన వైద్య విద్యార్థులు తప్పనిసరిగా కనీసం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి. ఈ మేరకు ముందే బాండ్ సమర్పించాలి.
బాండ్ను ఉల్లంఘిస్తే రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2019 బ్యాచ్కు చెందిన విద్యార్థులు తమ మూడేండ్ల కోర్సులో 17 నెలల పాటు కొవిడ్ సేవలు అందించారు. ఈ సేవలను బాండ్ కింద పరిగణించాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ప్రస్తుతం ఓపీ సేవలను నిలిపివేశారు. తమ డిమాండ్పై ప్రభుత్వం గురువారంలోగా సానుకూలంగా స్పందించకపోతే పూర్తి స్థాయి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.