కోల్కతా: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఇవాళ 15 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రీపోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29వ తేదీన జరిగిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాగ్రహాట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రభావత పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో దశ పోలింగ్ రోజున ఆ రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ ప్రక్రియను బీజేపీ స్వాగతించింది. మరిన్ని బూత్ల వద్ద రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రాన్ని తప్పుగా చూపించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది.