అహ్మదాబాద్, జూలై 17: ఫొటోను చూడగానే ఏదో గ్రహశకలం పడి రోడ్డుపై పెద్ద గొయ్యి ఏర్పడిందని అనుకుంటున్నారా? కానేకాదు. గుత్తేదారులతో అవినీతిపరులైన అధికారులు కుమ్మకైతే అభివృద్ధి పనులు ఎంత నాసిరకంగా ఉంటాయో.. తెలియజేసేదే ఈ చిత్రం. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లోని వస్ర్తాల్ ప్రాంతంలో ఆదివారం ఓ రోడ్డు ఉన్నట్టుండి కుంగిపోయింది. ఎంతలా అంటే ఓ స్కూల్ బస్సు పట్టేంత భారీ గొయ్యి ఏర్పడింది. ఆదివారం రెండుగంటల పాటు కురిసిన వర్షానికే ఈ రోడ్డు కుంగిపోయింది. రోడ్డు పనులు చేపట్టి చాలా కాలమైందని అనుకుంటే పొరపాటే. ఆ రోడ్డును నిర్మించి కేవలం నెల రోజులే అయ్యింది. రోడ్డు కుంగిపోయే సమయంలో అటు వైపు వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులతో గుత్తేదారులు కుమ్మక్కై ఇలాంటి నాసిరకం పనులు చేపట్టారంటూ స్థానికులు మండిపడుతున్నారు. కాగా, రోడ్డు కుంగిపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.