న్యూఢిల్లీ, మార్చి 24: ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి శుక్రవారం సంచలన ట్వీట్ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై తాను కూడా పరువు నష్టం దావా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ‘నేను ప్రధాని మోదీపై పరువు నష్టం దావా వేస్తా. ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా పని చేస్తాయో చూస్తా’ అని రేణుక వ్యాఖ్యానించారు. 2018లో పార్లమెంట్లో ‘శూర్పణఖ’ అంటూ మోదీ తనను పరోక్షంగా విమర్శించారని, దీనిపై పరువు నష్టం కేసు వేస్తానని రేణుక అప్పటి వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
అప్పుడు మోదీ ఏమన్నారు?
2018 ఫిబ్రవరి 7న పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు విపక్ష పార్టీల ఎంపీలు పలు సమస్యలపై నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరిని అప్పటి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వారించారు. దీన్ని ఆహ్వానిస్తూ ఆమె నవ్వారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘సభాపతి జీ, మేరీ ఆప్కో ప్రార్థనా హై.. రేణుకా జీ కో ఆప్ కుచ్ మత్ కహియే. రామాయణం సీరియల్ కే బాద్ ఐసే హసీ సునానే కా ఆజ్ సౌభాగ్య మిలా హై’ (గౌరవనీయమైన చైర్మన్ గారూ.. రేణుకాజీని ఏమీ అనవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. రామాయణం సీరియల్ తర్వాత, మొదటి సారి అలాంటి నవ్వు వినే భాగ్యం ఇప్పుడు దక్కింది) అని మోదీ అన్నారు. అయితే, రామాయణంలోని ‘శూర్పణఖ’ పాత్రను ఉద్దేశించే మోదీ పరోక్షంగా తనపై ఈ వ్యాఖ్యలు చేశారని రేణుక ఆరోపించారు. అయితే, ప్రధాని మోదీ శూర్పణఖ అనే పదాన్ని ప్రస్తావించలేదని, పార్లమెంటులో చేసిన ప్రకటనపై ఆమె కోర్టుకు వెళ్లలేరని కొందరు అభిప్రాయపడుతున్నారు.