శ్రీనగర్, ఏప్రిల్ 13: దేశంలో ఇటీవలి కాలంలో మతపరమైన అసహనం బాగా పెరిగిందని సిక్కుల సమన్వయ కమిటీ(ఏపీఎస్సీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడుతున్నవారిపై ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై సలహాలు, సూచనల కోసం పార్లమెంటరీ ప్యానల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఏపీఎస్సీసీ చైర్మన్ జే ఎస్ రైనా ఓ ప్రకటన విడుదల చేశారు. గురుద్వారాలు, మసీదులు, గుడులు, చర్చిల్లాంటి మతపరమైన స్థలాలు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరి మత సంప్రదాయాలను వారు ఎలాంటి భయం లేకుండా పాటించడానికి అవకాశం ఉండాలన్నారు. మత అసహనంపై సుప్రీం కోర్టు కూడా కల్పించుకోవాలని, ప్రజల మత స్వేచ్ఛను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.