ద్రవ్యోల్బణంతో సామాన్యుడు అతలాకుతలం.. పెచ్చరిల్లిన నిరుద్యోగం.. రోడ్డుపైకి యువత
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మత విద్వేషంతో బీజేపీ కొత్త ఎత్తుగడలు
తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనుసరించే ఏకైక ఆయుధం.. మత విద్వేషం. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, నిరుద్యోగం, ధరాఘాతం వంటి సమస్యలను పరిష్కరించకుండా.. కనీసం వాటిపై సమాధానం కూడా చెప్పకుండా వైఫల్యాన్ని కప్పిపెట్టేందుకు తనకు అనుకూల హిందూత్వ గ్రూపుల ద్వారా దేశవ్యాప్తంగా ‘మసీదు-ఆలయం’ వివాదాన్ని రేపింది. పలు రాష్ర్టాల్లోని మసీదులను కేంద్రంగా చేసుకొని.. ఆయా మసీదులు అంతకుముందు ఆలయాలు అని, ధ్వంసం చేసి మసీదులు నిర్మించారని పేర్కొంటూ ఆందోళనలు చేయడంతో పాటు కోర్టుల్లో కేసులు వేసి చర్చ ఆ వైపుగా మళ్లేలా ప్లాన్ వేసింది. ఆ జాబితా ఇదే..
ఉత్తరప్రదేశ్-వారణాసిలోని జ్ఞాన్వాపీ
జ్ఞాన్వాపీ మసీదు కాంప్లెక్స్లో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయని, పూజలకు అనుమతి ఇవ్వాలని కొంత మంది స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ కేసును వారణాసి జిల్లా కోర్టు విచారణ చేస్తున్నది. సర్వేలో కాంప్లెక్స్ పరిసరాల్లో శివలింగాన్ని గుర్తించామంటూ హిందువుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలుపడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
యూపీ-మథురలో శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ ప్రాంతానికి ఆనుకొని ఉండే షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని పిటిషన్ వేశారు. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయ కొంత భాగాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆరోపణ.
ఉత్తరప్రదేశ్-ఆగ్రాలోని తాజ్మహల్
తాజ్మహల్లో సీల్ చేసిన 22 గదులను తెరిపించేందుకు పురావస్తు శాఖను ఆదేశించాలంటూ బీజేపీ కోర్టులో పిటిషన్ వేసింది. తాజ్మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని, అది శివుడి గుడి అంటూ వాదించింది. ఈ వాదనను కోర్టు తిరస్కరించింది.
ఢిల్లీ-కుతుబ్మినార్ కాంప్లెక్స్
ఢిల్లీలోని కుతుబ్మినార్ విష్ణు స్తంభం అని పేర్కొంటూ హిందూత్వ సంస్థలు ఆందోళనలకు తెరలేపాయి. ముస్లిం పాలకులు దీనిలోని 27 ఆలయాలను కూల్చి నిర్మాణాన్ని మార్చారని ఆరోపించారు.
కర్ణాటక-జామియా మసీదు
కర్ణాటకలో శ్రీరంగపట్నంలోని మసీదు స్థానంలో అంతకుముందు హనుమాన్ ఆలయం ఉండేదని, సర్వే చేయించాలని కోరుతూ ‘నరేంద్ర మోదీ మంచ్’అనే రైట్వింగ్ గ్రూప్ డిమాండ్ చేస్తున్నది. మంగళూరులోని ఓ మసీదులో ఆలయం వంటి నిర్మాణాన్ని గుర్తించినట్టు హిందూత్వ సంస్థలు పేర్కొంటున్నాయి.