న్యూఢిల్లీ, జనవరి 9: మత మార్పిడులు తీవ్రమైన అంశమని, దానికి రాజకీయ రంగు పులమొద్దని సుప్రీం కోర్టు సూచించింది. బలవంతపు/మోసపూరిత మత మార్పిడుల విషయంలో కేంద్రం, రాష్ర్టాలు కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అటార్నీ జనరల్ సాయం చేయాలని ఆదేశించింది. బెదిరించడం, బహుమతులు ఇవ్వడం, ఆర్థిక ప్రయోజనాల ఆశ చూపించడం ద్వారా మత మార్పిడులకు పాల్పడుతున్నారని న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన పిటిషన్ను జస్టిస్ ఎమ్ఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన బెంచ్ విచారిస్తున్నది.
ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితమైనదని తమిళనాడు తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది విల్సన్ అన్నారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది కేవలం ఒక రాష్ర్టానికి సంబంధించిన విషయం మాత్రమే కాదని, దీన్ని రాజకీయం చేయొద్దని సూచించింది. బలవంతపు మత మార్పిడులు దేశవ్యాప్త సమస్య అని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పిటిషనర్ కోరారు. చేతబడి, మూఢ నమ్మకాలు, మాయల ద్వారా కూడా మత మార్పిడులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. బెదిరించి, ఆర్థిక ప్రయోజనాల ఆశ చూపించి చేసే మత మార్పిడులను నియంత్రించడంపై లా కమిషన్ ఒక నివేదికను, బిల్లును రూపొందించేలా చూడాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఫిబ్రవరి 7న తదుపరి విచారణ జరగనుంది.