Abhishek Banerjee : పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత అభిషేక్ బెనర్జీకి కోల్కతా హైకోర్టులో ఊరట లభించింది. తన పార్లమెంట్ నియోజకవర్గమైన అంతాలాలోని కార్యాలయాన్ని కూల్చివేయకుండా చూడాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూల్చివేత చర్యలు ఆపాలని సూచించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని అంతాలా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడి చేశారు.
అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ ఆఫీసును కూల్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఈ కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ అభిషేక్ బెనర్జీకి చెందిన లీప్స్ అండ్ బౌండ్స్ సంస్థ కోల్కతా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. దీంతో జస్టిస్ రాజాబసు చౌదరితో కూడిన హైకోర్టు ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అభిషేక్ బెనర్జీ ఆఫీసులో ఎలాంటి కూల్చివేతలు చేపట్టకూడదని ఆదేశించింది. ఇక, ఈ అంశంపై బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆఫీసు విషయంలో బీజేపీ గూండాలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు కూడా ఈ విషయంలో చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తమ ఆఫీసులోని కంప్యూటర్లు, ఫర్నీచర్ వంటి వాటిని కూడా తీసుకెళ్లినట్లు ఆరోపించారు.
మరోవైపు ఇప్పటికే కొంతవరకు అధికారులు బెనర్జీ ఆఫీసు కూల్చివేత చర్యలు చేపట్టారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ ఇలా చేయడం సరికాదని ఆయన విమర్శించారు. చట్టవ్యతిరేకంగా కూల్చివేతలు జరుగుతుంటూ పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల్ని తక్షణమే ఆపాలని హైకోర్టు ఆదివారం ఆదేశించింది. ఈ విషయంలో తమ తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఈ ఉత్వర్వులను పాటించాలని సూచించింది.