న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )తో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ మిత్రుడిగా ఆ దేశ అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలలో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పార్లమెంట్ భవనాన్ని కట్టించింది. కానీ ఇప్పుడా దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆఫ్ఘనిస్థాన్తో ఇండియా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. తాము ఎప్పటికప్పుడు ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ ప్రజలతో ఉన్న సంబంధాలే ఆ దేశంతో భారత్ ఎలా వ్యవహరించాలన్నది నిర్దేశిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి అందరిలాగే మేము కూడా ఆఫ్ఘనిస్థాన్లో పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. అక్కడి భారతీయుల భద్రత, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపైనే దృష్టి సారిస్తున్నాం అని ఆయన అన్నారు. ఆఫ్ఘన్ ప్రజలతో ఉన్న చారిత్రక సంబంధాలు ఎలాంటివో మేము ఆ దేశంలో పెట్టిన పెట్టుబడులే చెబుతున్నాయి. ఆఫ్ఘన్ ప్రజలతో ఆ సంబంధాలు కొనసాగుతాయి. అదే రానున్న రోజుల్లో మాకు మార్గనిర్దేశనం చేస్తుంది అని జైశంకర్ అన్నారు.
తాలిబన్లతో ఈ మధ్య కాలంలో ఏమైనా చర్చించారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కాబూల్లో ప్రస్తుతం పరిస్థితులను పరిశీలిస్తున్నాం. ఇప్పటికే తాలిబన్లు, వాళ్ల ప్రతినిధులు కాబూల్కు వచ్చారు. ఇక ఇక్కడి నుంచి చర్చలను ముందుకు తీసుకెళ్లాలి అని జైశంకర్ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితిపై చర్చించడానికి యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి జైశంకర్ న్యూయార్క్ వెళ్లారు.