Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ, జనవరి 14: అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ లౌకిక విధానానికి వ్యతిరేకంగా ఉందని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చైర్మన్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహమాన్ అన్నారు. ఆలయ ప్రారంభోత్సవంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. జరుగుతున్న కార్యక్రమం రాజకీయ ప్రేరేపితంగా ఉందన్నారు.
రామాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు తమ వారి మనసులను గాయపరిచిందని ఆరోపించింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసూ హిందూ సోదరులకు మాత్రమే సంబంధించిన ఈ మతపరమైన కార్యక్రమంలో ముస్లింలు పాల్గొనరాదని పిలుపునిచ్చారు.
‘రామ మందిర ప్రారంభోత్సవంపై ప్రభుత్వం, మంత్రులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రధాని రామ మందిరాన్ని ప్రారంభించడం న్యాయాన్ని, లౌకిక వాదాన్ని హత్య చేయడమే’ అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. జనవరి 22న దీపాలు వెలిగించడండి.. జై శ్రీరాం నినాదాలు ఇవ్వండంటూ ప్రధాని పిలుపునివ్వడంపై ఆయన మాట్లాడుతూ ఇది కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ముస్లింలు అర్థం చేసుకోవాలని అన్నారు. ‘అయోధ్య రామ మందిర నిర్మాణంపై హిందూ సోదరులు ఆనందంతో దీపాలు వెలిగించుకోండి. మాకు అభ్యంతరం లేదు. ముస్లింలు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదు’ అని ఆయన కోరారు. సుప్రీం కోర్టు తీర్పును ముస్లింలు గౌరవించినప్పటికీ అది వారి మనసులను మాత్రం గాయపరిచిందని ఆయన తన ప్రకటనలో స్పష్టం చేశారు.