భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 87 ఏండ్ల తర్వాత 55.5 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కేంద్రపడ ప్రాంతంలో గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో ఒడిశాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
భారత వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకటి నుంచి రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.