Amarnath Yatra : ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా పోటెత్తారు. యాత్ర ప్రారంభమైన ఐదు రోజుల్లోనే దాదాపు లక్ష మంది భక్తులు గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు అంచనా. ఈ ఏడాదికి సంబంధించిన అమర్నాథ్ యాత్ర ఈ నెల 3న ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాత్రకు ఎక్కువ మంది భక్తులు పోటెత్తారు. అయితే, యాత్ర ప్రారంభమైన ఐదు రోజుల తర్వాత మంచులింగం కరిగిపోయిందని ప్రభుత్వం తెలిపింది.
అయినప్పటికీ పవిత్ర గుహను సందర్శించే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. వేలాది మంది భక్తులు శివనామ స్మరణతో గుహను దర్శించుకుంటున్నారు. ఈ సారి ఐదు రోజుల తర్వాత మంచు శివలింగం కరిగిపోగా.. గత ఏడాది ఏడు రోజుల వరకు శివలింగం ఉందని అధికారులు వివరించారు. వాతావరణ మార్పులు, భూతాపం, గుహచుట్టూ కాలుష్యం పెరగడం, వీఐపీల తాకిడి ఎక్కువ కావడం, సరిహద్దులో వాతావరణం మారడం వంటి కారణాల వల్ల ఈసారి మంచు లింగం కరిగిపోయిందని అధికారులు అంటున్నారు. గత ఏడాది మొదటి నాలుగు రోజుల్లో 55,000 మంది భక్తులు దర్శించుకోగా.. ఈసారి 86,000 మంది దర్శించుకున్నారు. యాత్ర కోసం భక్తులు భారీ ఎత్తున కాశ్మీర్ చేరుకుంటున్నారు. నిజానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిని మాత్రమే యాత్రకు అనుమతిస్తారు. కానీ, కొందరు రిజిస్ట్రేషన్ లేకుండానే యాత్రకు వస్తున్నారు. దీంతో, ఇక్కడి రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద భారీ క్యూ కనబడుతోంది. వారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసేందుకు, తర్వాత ఆర్ఎఫ్ఐడీ కార్డులు తీసుకునేందుకు కూడా ఎక్కువ సమయం పడుతోంది.
రద్దీ అనూహ్య స్థాయిలో పెరగడం వల్ల రవాణా, భద్రత, పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అమర్నాథ్ యాత్ర బోర్డు వివరించింది. భక్తులకు అమర్నాథ్ యాత్ర బోర్డు అనేక సూచనలు చేస్తోంది. భక్తులు తమ వంతు వచ్చే వరకు సహనంతో ఉండాలని జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా కోరారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం భక్తులను అనుమతిస్తారని, ఎక్కువ మంది భక్తులను అనుమతించబోరని ఆయన అన్నారు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.